tdp protests : వైసీపీపై భగ్గుమంటున్న టీడీపీ- రాష్ట్రవ్యాప్త నిరసనలు-నేతల హెచ్చరికలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై నిన్న అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీ నేతలు రోడ్లపై నిరసనలు నిర్వహించారు. చంద్రబాబు, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి. వైజాగ్ లో మంత్రుల దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నిరసనలు
నిన్న ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఇవాళ రోడ్లపైకి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు దిగారు. పలు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో వైసీపీ సర్కార్ తీరుకు నిరనసగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనాలు చేపడుతున్నారు. వైసీపీ మంత్రుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలకు దిగుతున్నారు.

అడ్డుకుంటున్న పోలీసులు
నిన్న వైస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును, ఆయన సతీమణిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇవాళ తూర్పుగోదావరి జిల్లా పెదపూడి NTR విగ్రహం వద్ద శాంతియుతంగా మౌన దీక్ష చేపట్టడానికి వచ్చిన టీడీపీ నాయకులను పోలీసులు చెదరకొట్టారు. మౌన దీక్షకు అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియ చేస్తామని చెప్పడంతో ఆ తర్వాత అనుమతి లభించింది. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు కుటుంబం మీద వైసీపీ చేసిన వ్యాఖ్యలుకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు.

వైజాగ్ లో శవయాత్ర ఉద్రిక్తత
వాల్తేరులోని టీడీపీ కార్యాలయం వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ల నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో శవపేటిక తయారు చేసి శవయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే శవయాత్రకు పోలీసులు అనుమతించక పోవడంతో పార్టీ కార్యాలం గేటు తెరుచుకుని బయటకు వెళ్లే క్రమంలో వాగ్వాదం, ఉద్రిక్త చోటు చేసుకున్నాయి. అయితే వీరిని బయటికి రానీయకుండా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో వారు సీఎం డౌన్.. డౌన్, రాష్ట్ర ప్రభుత్వం అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

త్వరలో అసలు సినిమా చూపిస్తామన్న గొట్టిపాటి రవి
నారా భువనేశ్వరి గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ కుమార్తె గురించి మాట్లాడిన వైసీపీ నేతలను చూసి సభ్యసమాజం తలదించుకుంటుందన్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టారు అని ఆనందంలో ఉన్న వైసీపీ నేతలకు త్వరలోనే అసలు సినిమా చూపిస్తామన్నారు. ప్రజా క్షేత్రంలో వైసీపీ తప్పులను ఎండగట్టడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని గొట్టిపాటి తెలిపారు. 2024లో అసెంబ్లీలో కి ఎందుకు అడుగుపెట్టామా అని వైసీపీ నేతలు భాదపడేలా టీడీపీ ప్రణాళిక ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలతో తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు అవడం ఖాయమన్నారు.

తన పతనం రాసుకున్న జగన్
జగన్ తన చర్యల ద్వారా తన పతనాన్ని తనే కోరుకుంటున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. నిన్న జరిగిన అవమానం ప్రీ ప్లాన్డ్ గా జరిగిందేన్నారు. సెషన్స్ అందుకే పొడిగించినట్లు కనబడుతోందన్నారు. అసెంబ్లీలో అడుగడుగునా అవమానించడానికే సెషన్స్ పొడిగించారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి కాదనేది నిన్నటి సంఘటనే సాక్ష్యమని యనమల తెలిపారు. ఎప్పుడిలాంటి అసభ్య ఘటనలు జరిగినా నాయకుల్లో పశ్చాత్తాపం ఉంటుంది. కానీ ప్రిప్లాన్డ్ కాబట్టే జగన్ ముసిముసిగా నవ్వులతో తనవాళ్లను సమర్ధిస్తూ వికృతానందం పొందారని ఆరోపించారు. ఈ నీచ ప్రవర్తనకు ప్రజలు వైసిపికి పాతర వేయడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications