పరిషత్ పోరుపై టీడీపీ వ్యూహమిదే- బరిలో ఉన్న అభ్యర్ధులకు క్లారిటీ- అసంతృప్తి నేపథ్యం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పాత నోటిఫికేషన్తో నిర్వహిస్తున్నారన్న కారణంతో బాయ్కాట్ చేసిన టీడీపీ ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్ధుల విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్న అభ్యర్ధులను బరిలో నుంచి విరమింపచేసే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తోంది. తద్వారా వారిలో అసంతృప్తిని కాస్తయినా చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. అయితే దీనిపై అభ్యర్ధులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
పరిషత్ పోరు బాయ్కాట్తో అభ్యర్ధుల్లో అసంతృప్తి
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం గతంలో జారీ చేసిన పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినా పట్టించుకోకుడా ఎస్ఈసీ నీలం సాహ్నీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మండిపడుతోంది. ఇదే కారణంతో ఎన్నికలను బహిష్కరించాలని కఠిన నిర్ణయం తీసుకున్న టీడీపీ అధినేత.. బాధాకరమే అయినా తప్పలేదన్నారు. అయితే ఇప్పుడు అధినేత తీసుకున్న నిర్ణయానికి అభ్యర్ధులంతా కట్టుబడి ఉంటారా అంటే కష్టమేనన్న సమాధానం వస్తోంది. దీంతో అభ్యర్ధులకు ప్రత్యామ్నాయాలు సూచించాల్సిన బాధ్యత కూడా అధిష్టానంపైనే పడింది.
పరిషత్ పోరులో అభ్యర్ధులపై టీడీపీ కీలక నిర్ణయం
ప్రభుత్వం, ఎస్ఈసీ కుమ్మక్కై పరిషత్ పోరులో టీడీపీ అవకాశాలను దెబ్బతీస్తున్నారన్న కారణంతో ఎన్నికలను బహిష్కరించిన ఆ పార్టీ.. ఇప్పుడు అభ్యర్ధులకు ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నిరాశలో ఉన్న అభ్యర్ధుల్లో జోష్ నింపేందుకు వీలుగా ఇప్పుడు వారిని పోటీలో కొనసాగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. తద్వారా వారిలో అసంతృప్తి తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుని అభ్యర్ధుల్ని కొనసాగించడంపై వస్తున్న విమర్శలకు సమాధానంగా వారికి మరో సూచన చేస్తోంది.
వ్యక్తిగతంగా బరిలోకి టీడీపీ అభ్యర్ధులు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికల బాయ్కాట్కు అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ అభ్యర్ధులను అధికారికంగా ఉపసంహరించే అవకాశం లేదు. దీంతో వారిని పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా పోటీ చేయాలని సూచిస్తోంది. ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్తున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తద్వారా అభ్యర్ధుల్లో అసంతృప్తిని కాస్తయినా చల్లార్చ వచ్చని భావిస్తోంది.