ఏపీ, టీలకు న్యాయం: సుజన, అవసరం లేదు: టీఎన్జీవో
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు ప్రజలందరికీ న్యాయం జరగాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తోందని, కావాలని సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇకపై ఇలాంటివి ఉపేక్షించమని హెచ్చరించారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని, ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందుకు వెళ్లాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేయాలనుకుంటున్న సమగ్ర సర్వే రాజ్యంగ విరుద్ధమన్నారు. తెలుగు ప్రజలు ఇబ్బందులు పడకూడదంటే, ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించేవిధంగా నాయకులు వ్యవహరించవద్దన్నారు. ఏపీ, తెలంగాణల మధ్య బేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు.
బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. విభజన బిల్లు సమయంలో సంబరాలు చేసుకున్న తెరాస నేతలు ఇప్పుడు అదే చట్టాన్ని వ్యతిరేకించడమేమిటని ప్రశ్నించారు. గవర్నర్ ప్రత్యేక అధికారాలు వినియోగించే అవకాశం లేకుండా పరిపాలన సాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టాన్ని అమలు చేయడం తప్పేలా అవుతుందన్నారు.
ఏపీపై దృష్టి పెట్టండి: రాజయ్య
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదు పైన కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య హైదరాబాదులో అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారాలను గవర్నర్కు అప్పగించడం సరికాదన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్దే తుది నిర్ణయమన్నారు.
మాకవసరం లేదు
తెలంగాణలో ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేకు ఏపీ ఉద్యోగుల అవసరం తమకు లేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సర్వేను పూర్తి చేసే శక్తి తమకు ఉందన్నారు. కాగా, ఇంటింటి సర్వేలో ఏపీకి చెందిన సిబ్బందికి విధులు అప్పగించడంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. తాము సర్వేలో పాల్గొనమని చెప్పిన విషయం తెలిసిందే.