చిక్కుల్లో వంగలపూడి అనిత - చంద్రన్న ఆదుకొనేనా..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. కొద్దిరోజులుగా మౌనంగా ఉంటోన్నారు. ఇదివరకు ప్రెస్మీట్లను నిర్వహిస్తూ నిత్యం వార్తల్లో కనిపిస్తూ వచ్చిన ఆమె హఠాత్తుగా తెర వెనక్కి వెళ్లారు. హిందూపురం లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో వంగలపూడి అనిత- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు.
మోదీ రాజీనామా అజెండా: చట్టం దృష్టిలో నేరమా?- బీజేపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన సుప్రీం
భూ వివాదంలో..
దీని తరువాత ఆమె హఠాత్తుగా తెరవెనక్కి వెళ్లినట్టే కనిపిస్తోంది. ఇదివరకట్లా తరచూ ప్రెస్ మీట్లను నిర్వహించట్లేదు. తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు. ఈ పరిణామాల మధ్య వంగలపూడి అనిత- ఇప్పుడు కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయంలో ఆమె బ్యాంకు నోటీసులను కూడా అందుకున్నారు. బ్యాంకు బకాయిలను చెల్లించే విషయంలో నోటీసులను ఎదుర్కొంటోన్నారు.
కర్ణాటక బ్యాంక్ నోటీసులు..
తమకు బకాయి పడ్డ 82,71,584 రూపాయలను చెల్లించాలంటూ కర్ణాటక బ్యాంక్ తాజాగా వంగలపూడి అనితకు నోటీసులను జారీ చేసింది. వంగలపూడి అనితతో పాటు అనిత గుట్టవెల్లికీ నోటీసులు అందాయి. వడ్డీతో కలుపుకొని ఈ మొత్తాన్ని నోటీసు అందిన 60 రోజుల్లోగా చెల్లించాలంటూ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కర్ణాటక బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఈ నోటీసులను పంపించింది.
నక్కపల్లిలో..
రీ-కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని రూల్ 9, సెక్షన్ 13 (12) కింద వంగలపూడి అనితకు నోటీసులను జారీ చేసినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని క్రిష్ గోకులం లేఅవుట్లో ప్లాట్ నంబర్ 21లో 300 గజాలు, ప్లాట్ నంబర్ 20లో 267ల్లో బిల్డింగులు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఉన్న బిల్డింగులు వంగలపూడి అనిత పేరు మీదే రిజిస్టర్ అయ్యాయి.
60 రోజుల్లోగా..
ఈ రెండు చోట్ల ఉన్న స్థిరాస్తులు ఈ నెల 1వ తేదీ నుంచి విశాఖపట్నంలోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ శాంతిపురం బ్రాంచ్ పరిధిలోకి వచ్చాయి. ఇతరులు ఈ స్థిరాస్తులతో ఎలాంటి డీలింగ్ కూడా నిర్వహించకూడదని కర్ణాటక బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన పబ్లిక్ నోటీస్ను జారీ చేసింది. నక్కపల్లి మండలం క్రిష్ గోకులం లే అవుట్లోని ప్లాట్ నంబర్లు 22, 21ల్లో గల స్థిరాస్తులు తమకు చెందుతాయని వివరించింది.