చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ: విశాఖలో పార్టీ మనుగడ కష్టం: కన్నెత్తి చూడట్లేదంటూ
అమరావతి: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు వలసబాట పట్టారు. మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెప్పారు. తాజాగా అదే తరహా పరిస్థితులు మళ్లీ పునరావృతం అయ్యేలా ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని వీడుతారంటూ ఇదివరకు ప్రచారం జరిగినా.. అది వాస్తవరూపాన్ని దాల్చలేదు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో ప్రభుత్వం బాగా పనిచేసిందంటూ బహిరంగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించిన ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే?: స్టిక్కర్ అతికించిన కారులో బ్లాక్మనీ, బంగారం?: తమిళనాడులో సీజ్
పార్టీ స్థితిగతులపై
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఘాటుగా లేఖ రాశారు. విశాఖపట్నంలో పార్టీ స్థితిగతులను వివరిస్తూ లేఖ రాశారు. పార్టీ మనుగడ కష్టతరమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సమీక్షించడంపై పార్టీ అగ్ర నాయకత్వం స్పందించకపోవడాన్ని వాసుపల్లి గణేష్ ఈ లేఖలో ప్రస్తావించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి టీడీపీ వ్యతిరేకం అనే భావన ప్రజల్లో నెలకొందని, దాన్ని మరింత బలపరిచేలా పార్టీ పనితీరు ఉందని చెప్పుకొచ్చారు.
వరుస ప్రమాదాలు సంభవిస్తున్నా..
విశాఖపట్నంలో చోటు చేసుకుంటోన్న వరుస ప్రమాదాలను బేస్గా చేసుకుని వాసుపల్లి గణేష్.. చంద్రబాబుకు లేఖ రాశారు. ఇటీవలి కాలంలో విశాఖ పరిసరాల్లో పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయని చంద్రబాబుకు గుర్తు చేసిన ఆయన.. బాధితులను పరామర్శించడానికి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబు గానీ.. పార్టీ అగ్ర నాయకత్వం గానీ విశాఖపట్నం వైపు కన్నెత్తి చూడలేదని చెప్పుకొచ్చారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తరువాత.. పార్టీ మనుగడ మరింత కష్టతరమైందని అన్నారు.
వ్యతిరేకమనే భావన..
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాన్ని నిర్వహించడం వల్ల తెలుగుదేశం, చంద్రబాబు విశాఖను రాజధానిగా బదలాయించడాన్ని వ్యతిరేకం అనే భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా నాటుకునిపోయిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విశాఖ సహా ఉత్తరాంధ్రలో పార్టీ నాయకులు, క్యాడర్లో ధైర్యాన్ని, మనోబలాన్ని నింపడానికి పార్టీ అగ్ర నాయకత్వం ఎలాంటి చర్యలను చేపట్టలేకపోయిందని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పుకొచ్చారు.
బాధితులను పరామర్శించకపోవడం పట్ల..
అదే సమయంలో- ఎల్జీ పాలిమర్స్ మొదలుకుని రాంకీ ఫార్మా పేలుడు వరకు విశాఖపట్నం పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ.. బాధితులను పరామర్శించకపోవడాన్ని వాసుపల్లి గణేష్ తప్పుపట్టారు. పరిశ్రమల్లో సంభవించిన ప్రమాదాల వల్ల బాధితులను పరామర్శించే విషయంలో చంద్రబాబు గానీ, పార్టీ అగ్ర నాయకులు గానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ నిర్లిప్తతను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ మనుగడ కష్టతరమౌతుందని హెచ్చరించారు.