ఏడ్చేశారు: గర్భం దరించిందని విద్యార్థినికి టీసి ఇచ్చేశారు
కర్నూలు: గర్భం దాల్చిందనే కారణంతో ఉపాధ్యాయులు పదో తరగతికి విద్యార్థినికి టీసీ ఇచ్చేసి ఇంటికి పంపించారు. ఉపాధ్యాయులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల బాలిక, ఆమె తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తప్పు తెలుసుకుని కర్నూలు జిల్లాలోని ఓ మైనార్టీ కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
పదో తరగతి చదువుతున్న బాలికకు రెండు నెలలుగా రుతుస్త్రావం ఆగిపోవడంతో పాఠశాల ఇన్చార్జి, ఏఎన్ఎం బాలికను ఈనెల 11 న బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. గర్భిణి అని రిపోర్టు ఇవ్వడంతో తల్లిదండ్రులను పిలిపించి 13వ తేదీన బాలికకు టీసీ ఇచ్చి పంపించారు.

తల్లిదండ్రులు తమ కూతుర్ని కొలిమిగుండ్లలోని శుశ్రుత డయాగ్నోస్టిక్, జమ్మలమడుగులోని వెంకటసాయి భరద్వాజ హాస్పిటల్లో 14వ తేదీన పరీక్షలు చేయించారు. గర్భం ధరించలేదని రిపోర్టు ఇచ్చారు. 23వ తేదీ నంద్యాల జిల్లా వైద్యశాలలో కూడా పరీక్షలు చేయించారు. గర్భిణి కాదని తేలింది. దీంతో తమ కూతురిపై వేసిన నిందకు వారు విలపించారు.
బాలికకు రెండు నెలలు రుతుస్త్రావం కాకపోవడంతో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించామని కస్తూర్బా పాఠశాల ఇంచార్జీ ఎస్వో సయిదా కలీద్ ఫాతిమా చెప్పారు. వారు గర్భిణి అని రిపోర్టు ఇచ్చారని, తల్లిదండ్రులను పిలిపించి వారి అనుమతితోనే టీసీ ఇచ్చి పంపించామని అన్నారు. పాఠశాలకు చెడ్డపేరు రాకూడదని ఇలా చేశామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపలేదని అన్నారు. బాలికను తిరిగి పాఠశాలలో చేర్చుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications