ఎంత పనిచేశావమ్మా!.. 'మౌనిక'ను అలా చూసి తల్లడిల్లిన తల్లి గుండె, కన్నీటి వీడ్కోలు..
కెమిస్ట్రీ ఇంటర్నల్ ఎగ్జామ్ రోజున రాగమౌనిక కాపీకి పాల్పడిందని లెక్చరర్స్ ఆమెను పరీక్ష హాల్ నుంచి బయటకు పంపించారు. మిగతా పరీక్షలకు కూడా అనుమతించలేదు.
నెల్లూరు: సత్యభామ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన దువ్వూరు రాగమౌనిక రెడ్డి మృతదేహం గురువారం ఆమె స్వస్థలం నెల్లూరు జిల్లా మాటుమడుగు గ్రామానికి చేరుకుంది.
కుమార్తె మృతదేహాన్ని చూసి ఆమె తల్లి గుండెలవిసేలా ఏడ్చారు. ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కుమార్తెతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆ తల్లి విలపించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
ఏమ్మా.. ఎంత పనిచేశావమ్మా:
"ఏమ్మా.. నాతో చెప్పకుండా ఎప్పుడూ ఏ పనిచేసే దానివి కాదు.. ఇప్పుడు మాత్రం ఎందుకమ్మా ఇంత ఘోరం చేసుకున్నావు. కానరాని లోకానికి ఎందుకెళ్లావమ్మా.. నీ తోబుట్టువుకు.. మాకు ఇక తోడెవరమ్మా..' అంటూ ఆ తల్లి బోరున విలపించింది. విషాదాన్ని దిగమింగుకుంటూనే మృతురాలి సోదరుడు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.
భగ్గుమన్న విద్యార్థులు: 'మౌనిక' ఆత్మహత్య, సత్యభామ వర్సిటీలో విధ్వంసం, అసలేం జరిగింది?..
ఇదీ నేపథ్యం:
రాగమౌనిక మృతదేహం రావడంతో మాటుమడుగులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాటుమడుగు పంచాయితీ రాజకీయాల్లో చాలా కాలం పాటు చక్రం తిప్పిన దివంగత దువ్వూరు వెంకటస్వామిరెడ్డి ఏకైక కుమారుడు రాజారెడ్డి. రాజారెడ్డి కవల పిల్లలుగా రాగమౌనిక రెడ్డి, రాకేష్ 1999 సెప్టెంబరు 13న జన్మించారు. రాజారెడ్డి ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు.
మెరిట్ స్టూడెంట్:
రాగమౌనిక మెరిట్ స్టూడెంట్ అని ఆమె స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ మార్కులు పరిశీలిస్తే తెలుస్తోంది. పదో తరగతిలో 9.2 జీపీఏ, ఇంటర్లో 90 శాతం పైగా మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్ శ్రీచైతన్యలో సోదరుడు రాకేష్ తో పాటే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కూడా ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారని సమాచారం.
'కాపీ' ఆరోపణలపై వాళ్లిలా:
కెమిస్ట్రీ ఇంటర్నల్ ఎగ్జామ్ రోజున రాగమౌనిక కాపీకి పాల్పడిందని లెక్చరర్స్ ఆమెను పరీక్ష హాల్ నుంచి బయటకు పంపించారు. మిగతా పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే రాగమౌనిక కుటుంబ సభ్యుల ఆరోపణలు మరోలా ఉన్నాయి. తన జవాబు పత్రాల్లో చూసి పక్కనవాళ్లు రాస్తున్నప్పుడు లెక్చరర్స్ రాగమౌనికనే నిందించారని అందుకే ఆమె మనస్తాపానికి గురైందని అంటున్నారు. కనీసం లెక్చరర్స్ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి తరగది గదిలో కూర్చోబెట్టి ఉంటే ఇంత ఘోరం జరగకపోయేది అంటున్నారు.
తరలివచ్చని గ్రామస్తులు:
రాగమౌనిక మృతదేహం మాటుమడుగు గ్రామానికి రాగానే గ్రామస్తులంతా ఆమె ఇంటివద్దకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలన్ని జనసంద్రాన్ని తలపించాయి. సాయంత్రం 4గం. సమయంలో మృతదేహం ఇంటికి చేరుకుంది. ఆపై అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.