ఎన్నికలకు ముందే టి: డిగ్గీ, తెలియదని కిరణ్కు కౌంటర్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిందని, అప్పుడే తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు అంగీకరించారని, ఎన్నికలకు ముందే రాష్ట్రం ఏర్పడుతుందని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు. సీమాంధ్ర నేతలు రాష్ట్రపతికి అఫిడవిట్ ఇచ్చే బదులు అసెంబ్లీలో జరిగే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తే బాగుంటుందని సూచించారు.
2014 కంటే ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. కాంగ్రెసు పార్టీ రాజకీయాలను పరిపాలనతో ముడిపెట్టదన్నారు. తెలంగాణపై గతంలో అన్ని పార్టీలు వాగ్దానం చేశాయని చెప్పారు. ఇప్పుడు కొన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా తాము విభజనకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనానికి, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేదన్నారు.
ముఖ్యమంత్రికి కౌంటర్
రాష్ట్ర విభజన నిర్ణయంలో చివరి బంతి పూర్తి కాలేదని, అప్పటి వరకు పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దిగ్విజయ్ కౌంటర్ ఇచ్చారు. చివరి బంతి ఎప్పుడు వస్తుందో ముఖ్యమంత్రికి తెలియక పోవచ్చునన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు, హైదరాబాదులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మంత్రి జానా రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలు సమావేశమయ్యారు. అంతకుముందు జానా నివాసంలో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.