టి: 4వారాలు కష్టమే!, కిరణ్కు ఆ దమ్ములేదని విహెచ్
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చకు మరో నెల రోజుల గడువు కష్టమేనని కేంద్ర హోంశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కోసం మరో నాలుగు వారాల గడువు ఇవ్వాలని రాష్ట్రం కోరిన విషయం తెలిసిందే. ఈ లేఖను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. అయితే, నెల రోజులు కష్టమవుతుందని, తుది నిర్ణయం మాత్రం రాష్ట్రపతిదే అని చెబుతున్నాయి. కాగా, గడువుపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం రానుంది.
రాష్ట్రపతికి వివేక్ లేఖ
బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని పెద్దపల్లి ఎంపి వివేక్ రాష్ట్రపతికి లేఖ రాశారు. గడువు పెంచినా చర్చ సజావుగా సాగదన్నారు. తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాతనే పార్టీ విలీనంపై తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతారని చెప్పారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
కిరణ్కు దమ్ము లేదు: విహెచ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కొత్త పార్టీ పెట్టే దమ్ము లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు వేరుగా అన్నారు. సీట్లో కూర్చొని ఎన్ని మాటలైనా చెప్పవచ్చునన్నారు. పదవి లేనప్పుడే సత్తా తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి తమ్ముడికి పార్టీ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు గడువును పెంచవద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు సభాపతి నాదెండ్ల మనోహర్ను కోరారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా అభిప్రాయాలు పంపించాలన్నారు. గడువు పెంచవద్దని కోరేందుకు టిటిడిపి నేతలు రాష్ట్రపతి అపాయింటుమెంట్ కోరారు. గడువు పెంచవద్దని రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు.