బిజెపి జిల్లా అధ్యక్షుల రాజీనామా: వెనక కిషన్ రెడ్డి?
తెలంగాణలో సొంతంగానే పార్టీ పోటీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పొత్తు చర్చలతో సంబంధం లేకుండా పలు చోట్ల బిజెపి అభ్యర్థులు తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తు పెట్టుకున్నా తాము తెలుగుదేశం పార్టీకి సహకరించబోమని, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉంటామని వారు చెబుతున్నారు.
తెలంగాణ పార్టీ నాయకుల ఆందోళన వెనక బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచీ ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అయితే, తాను అందుకు వ్యతిరేకంగా లేనని చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ రోజు సాయంత్రానికి తెలుగుదేశం పార్టీతో పొత్తులు కొలిక్కి వస్తాయని ఆయన చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని కూడా ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారంనాడు చెప్పారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన బిజెపి కార్యకర్తలు శనివారం బిజెపి కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అయితే, బిజెపితో పొత్తుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సుముఖంగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు మీడియా ప్రతినిధులతో అన్నారు. జాతీయ పార్టీ నాయకులకు తాము ఈ మేరకు వినతిపత్రం ఇస్తామని వారు చెప్పారు. టిడిపితో పొత్తు ఆలోచనను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమంలో రెండు నాల్కల ధోరణిని తీసుకున్న తెలుగుదేశం పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రజలు అడుగుతున్నారని వారు చెప్పారు. పొత్తు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి గానీ ఆధిపత్యం వహించే పద్ధతిలో వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర నాయకులతో సంబంధం లేదు, మేం జాతీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుంటామనే టిడిపి వైఖరి సరి కాదని వారన్నారు. తాము రాజీనామా చేయలేదని, తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోతే ఏం చేస్తామనేది చెప్తామని వారన్నారు.