రాహుల్ గాంధీ జెట్స్పీడ్: సొమ్మసిల్లిన విహెచ్, చెమటోడ్చిన తెలంగాణ నేతలు
ఆదిలాబాద్: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ వేగాన్ని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అందుకోలేకపోయారు. ఎండ మండిపోతున్నా, ఉక్కపోతే ఇబ్బంది పెడుతున్నా ఆయన తన వేగాన్ని తగ్గించలేదు. రాహుల్ గాంధీ 15 కిలోమీటర్ల పాదయాత్రను రాహుల్ నాలుగు గంటల్లో పూర్తిచేశారు.
కొరిటికల్ గ్రామం నుంచి పాదయాత్ర ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. గ్రామంలో రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్ వాహనంలో గ్రామం సరిహద్దు వరకు వచ్చి, అక్కడి నుంచి నడక ప్రారంభించారు. యాత్ర ప్రారంభంలో ఎండ ఊపిరి సలపనీయలేదు. రోడ్డపై రేగుతున్న దుమ్ముధూళిని లెక్క చేయకుండా రాహుల్ శరవేగంగా నడిచారు.
ఆయనను అందుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఆయన వేగాన్ని అందుకోలేకపోయారు. ఒక్క నేత కూడా చివరిదాకా ఆయన పాదయాత్రను అనుసరించలేకపోయారు. పలువురు నాయకులు వాహనాలకే పరిమితమయ్యారు. యాత్ర 2 కిలోమీటర్లు పూర్తయ్యేసరికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియా వ్యాన్ ఎక్కేశారు.
మరో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య యాత్ర పొడుగునా కారులోనే గడిపారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఒకరి తర్వాత ఒకరు యువనేతతోపాటు కలిసి నడిచారు. కొరిటికల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మణచాంద తండా వరకు మండుటెండలోనూ రాహుల్ వేగంగా నడిచారు.
చివరికి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఎండవేడిమికి సొమ్మసిల్లిపోయారు. లక్ష్మణచాంద తండా నుంచి వాతావరణం సహకరించడంతో చిరుజల్లుల నడుమ పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాహుల్ వడ్యాల్కు చేరుకున్నారు. యాత్ర పొడవునా రెండుచోట్ల ఆగి పదినిమిషాల చొప్పున సేదదీరారు. పాదయాత్ర ముగిసే సరికి రాహుల్ దుస్తులు చెమటతో తడిసి ముద్దయ్యాయి.