ఏపీ ఎన్నికల్లో గెలుపు వారిదే: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ప్రజల నాడి పట్టుకునేందుకు వివిధ సంస్థలు, ఏజెన్సీలు సర్వేల పేరుతో ఫలితాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఇస్తుండగా, మరికొన్ని సంస్థలు వ్యతిరేకంగా ఇస్తున్నాయి. అయితే ప్రజల నాడి ఎలా ఉంది? అనే విషయంలో వారి నాడిని కచ్చితంగా పట్టుకునే సంస్థలు కూడా ఉన్నాయి. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ ఎన్నికలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
గతంలో ఓసారి కేటీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఏపీలో ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని చెప్పిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో కేటీఆర్ అంచనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో ఏర్పడుతుంది. ఏపీలో వైఎస్ జగన్ తో కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. దీనిప్రకారం కేటీఆర్ జగన్ కే ఓటేస్తారనుకున్నారు. అయితే ఇక్కడే కేటీఆర్ చిన్న మెలిక పెట్టారు. గతంలో తనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి మాట్లాడారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ జగన్ తనకు అన్నలాంటి వారని, టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్నేహితుడని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు పెద్దవారని, పవన్ కల్యాణ్ తనకు సోదరుడితో సమానమన్నారు. తన మద్దతు ఎవరికనేది స్పష్టంగా చెప్పలేదు. తన అంచనాను కూడా వెల్లడించలేదు. ఎవరు గెలిచినా ప్రజలకు మాత్రం మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికరంగా మారాయి. ఆందోళనలు, ధర్నాలు చేసేవారు ఏపీకి వెళ్లి చేసుకోవాలని కామెంట్స్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పై, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అటువంటి తప్పుకు మరోసారి తావివ్వకూడదనే ఉద్దేశంతో అంతిమంగా ప్రజలే గెలవాలన్నట్లుగా కేటీఆర్ చాలా తెలివిగా సమాధానమిచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications