తెలంగాణ: రాష్ట్రమంతా హై అలర్ట్, అదనపు భద్రత
హైదరాబాద్: రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. అదనపు కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించారు. హైదరాబాదులోని సీమాంధ్ర నాయకుల ఇళ్లకు, కార్యాలయాలకు భారీ భద్రత కల్పించారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల ఇళ్ల వద్ద పహరాను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు.
హైదరాబాదులోని ఎమ్మెల్యేల కాలనీల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్సును కూడా రంగంలోకి దించారు. రాజకీయ నాయకులు వెళ్లే రహదారుల్లో, వారి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు రహదారుల్లో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు.
సీమాంధ్ర ప్రాంతాల్లో కూడా పెద్ద యెత్తున బలగాలను మోహరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయని సీమాంధ్ర నాయకుల ఆస్తులకు భద్రత కల్పించారు. రేపటి నుంచి సాధారణ భద్రత కన్నా మించి అదనపు భద్రత అమలులోకి వస్తోంది. కాంగ్రెసు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్ తదితరుల ఇళ్ల వద్ద భధ్రతను పెంచారు
ఎంపీల గన్మెన్ను అప్రమత్తం చేయాలని ఆదేశాలు వెళ్లాయి. పార్లమెంటు సభ్యులకు కల్పించిన భద్రతను సమీక్షించాలని కూడా ఆదేశాలు వెళ్లాయి. బుధవారం పార్లమెంటులో జరిగిన సంఘటనలను, మంగళవారంనాడు ఢిల్లీలో లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణపై జరిగిన దాడిని, తదితర సంఘటనలను పరిగణనలోకి తీసుకుని భద్రతను పెంచారు.