వాయిదా కోరితే రూ.50 వేలు చెల్లించాలి - పిటీషనర్లకు హెచ్చరిక : సీఎం జగన్ కేసుల్లో హైకోర్టు..!!
జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ కోరితే ఖర్చుల కింద రూ 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి తమపై దాఖలైన కేసులను కొట్టేయాలని వివిధ చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న సంస్థలు, వ్యక్తులు హైకోర్టులో క్వాష్, ఇతర పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.
జాబితా వారీగా కేసు విచారణకు పిలవగా దాల్మియా సిమెంట్స్కు చెందిన పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినిపించడానికి న్యాయవాది గడువు కోరారు. వివాహం కారణంగా సీనియర్ న్యాయవాదులు రాలేదని పేర్కొన్నారు. తర్వాత ఏపీ సీఎం జగన్కు దిగువ కోర్టులో విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్ను వాయిదా వేయాలని న్యాయవాది నవీన్కుమార్ కోరారు. ఇలా వాయిదాలు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ కేసులు విచారణకు వచ్చినప్పుడు వాదనలు వినిపించాల్సిందేనని లేని పక్షంలో రోజుకు రూ.50 వేల చొప్పున ఖర్చుల కింద హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించారు. అందరి అంగీకారం మేరకే కేసులను లిస్ట్ చేశామని, ఇప్పుడు మళ్లీ వాయిదాలు కోరడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం వాన్పిక్ కేసులో 6వ నిందితుడైన ఐఆర్ఏస్ మాజీ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కొంత సేపు వాదనల అనంతరం తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications