YS Jagan case : ఆ కేసులో జగన్కు బిగ్ రిలీఫ్- ఈడీకి షాకిచ్చిన హైకోర్టు..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాన్పిక్ (వాడరేవు-నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్) ప్రాజెక్టుకు సంబంధించి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను విడుదల చేయాలంటూ గతంలో పీఎంఎల్ఏ (PMLA) అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన 9 సివిల్ మిస్సిలేనియస్ సెకండ్ అప్పీళ్లను (CMSAs) కోర్టు కొట్టివేసింది.
హైకోర్టు ధర్మాసనం తీర్పు
న్యాయమూర్తులు జస్టిస్ పి. శామ్ కోశి, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసుపై ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం, డిసెంబర్ 23, 2025న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తుది తీర్పును ప్రకటిస్తూ, అప్పిలేట్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి బలమైన లేదా అదనపు చట్టపరమైన ఆధారాలు ఈడీ చూపించలేకపోయిందని స్పష్టం చేసింది.

కేసు పూర్వాపరాలు: అసలు వివాదం ఏమిటి?
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాన్పిక్ (VANPIC) ప్రాజెక్టు కేటాయింపుల్లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు క్విడ్ ప్రో కో (క్విడ్ ప్రో కో అంటే ఒక లబ్ధికి ప్రతిఫలంగా మరొక లబ్ధి చేకూర్చడం) పద్ధతిలో అయాచిత ప్రయోజనాలు దక్కాయని ఈడీ ఆరోపించింది.దీనికి ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీల్లో రూ. 854.50 కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఇవి ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన లంచాలు లేదా అక్రమ పారితోషికాలని ఈడీ వాదించింది.
ఈ ఆరోపణల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద జగన్ గ్రూప్, నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్నకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు (Attach) చేసింది.
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన క్లారిటీ ఏంటి?
ఈడీ జప్తు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్ క్యాంప్ పీఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి.జూలై 2019లో ఈ కేసును విచారించిన ట్రిబ్యునల్ ఈడీ చర్యను తప్పుబడుతూ,జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది.ట్రిబ్యునల్ తన విచారణలో ఒక కీలకమైన నిజాన్ని గుర్తించింది.
"నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులన్నీ వాన్పిక్ ప్రాజెక్ట్ గ్రౌండ్ అవడానికి ముందే జరిగాయి. కాలక్రమానుసారం చూస్తే, ప్రాజెక్టు ఉనికిలోనే లేనప్పుడు పెట్టిన పెట్టుబడులను,ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టుకు ప్రతిఫలంగా ఇచ్చిన లంచాలుగా పరిగణించలేం." అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.
ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ ముగింపులు హేతుబద్ధంగా, రికార్డుల్లోని ఆధారాలకు లోబడే ఉన్నాయని తెలంగాణ హైకోర్టు తాజాగా అంగీకరిస్తూ సమర్థించింది.
విడుదల కానున్న ఆస్తుల వివరాలు
హైకోర్టు తాజా తీర్పుతో ఈడీ జప్తు చేసిన సుమారు రూ. 863.33 కోట్ల విలువైన ఆస్తుల విడుదలకు మార్గం సుగమమైంది.ఇందులో జగతి పబ్లికేషన్స్ (రూ. 450 కోట్లు), సండూర్ పవర్స్ (రూ. 54.94 కోట్లు), కార్మెల్ ఆసియా హోల్డింగ్స్ (రూ. 20 కోట్లు) తో పాటు జగన్ వ్యక్తిగత స్థిరాస్తులు (రూ. 13.35 కోట్లు) ఉన్నాయి.
నిమ్మగడ్డ ప్రసాద్ వ్యక్తిగత ఆస్తులు (రూ. 37.83 కోట్లు), ఆల్ఫా అవెన్యూస్, ఆల్ఫా విల్లాస్, గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, జి2 కార్పొరేట్ సర్వీసెస్, సుగుణి కన్స్ట్రక్షన్స్ మరియు వాన్పిక్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి.
ప్రభుత్వాలు తీసుకునే పారిశ్రామిక, ఆర్థిక విధాన నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు తమ సొంత అభిప్రాయాలతో భర్తీ చేయలేవని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. మొత్తానికి ఏడేళ్లుగా సాగుతున్న ఈ చట్టపరమైన పోరాటంలో వైయస్ జగన్కు, నిమ్మగడ్డ ప్రసాద్కు హైకోర్టు తీర్పుతో పెద్ద ఉపశమనం లభించింది.













Click it and Unblock the Notifications