నయీం కేసు :సిట్ నివేదిక ఆధారంగానే పోలీసులపై చర్యలు, మీడియా కథనాలపై ఇలా..
గ్యాంగ్ స్టర్ నయాంతో పోలీసు అధికారులు సంబంధాలున్నాయనే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోబోమని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రకటించారు.
విశాఖపట్టణం :కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ నయీంతో పోలీసులు అధికారులు కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో ప్రసారం కావడంపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి స్పందించారు.మీడియాలో వచ్చిన ఫోటోల ఆధారంగా చర్యలు తీసుకోబోమని ఆయన ప్రకటించారు.
గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయనే విషయమై ప్రసార సాధనాల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ మేరకు కొందరు పోలీసు అదికారులు నయీంతో కలిసి ఉన్న ఫోటోలు కూడ వచ్చాయి. అయితే ఈ ఫోటోల ఆధారంగానే నిందితులపై పోలీసు అధికారులపై చర్యలు తీసుకోనే అవకాశం లేదని నాయిని ప్రకటించారు.
విశాఖ పట్టణంలో శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా హోంమంత్రి నాయిని మీడియాతో మాట్లాడారు.అంతేకాదు మీడియాలో వచ్చిన ఫోటోల ఆధారంగా, డైరీ ఆధారంగా చర్యలు ఉండవని చెప్పారు.నయీం కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారని , సిట్ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని ఆయన ప్రకటించారు.
అయితే ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్ళకు తాను తలొగ్గేది లేదని ఆయన చెప్పారు. టిజెఎసి చైర్మెన్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రాజెక్టుల నిర్మాణానికి కోదండరామ్ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు.