తెలంగాణలో సర్వే: ఆఫీసర్స్ మల్లగుల్లాలు, ఓల్డ్ సిటీలో..
హైదరాబాద్: తెలంగాణ వ్య్రాప్తంగా ఒకేరోజు అన్ని కుటుంబాల సమగ్ర సర్వేను ఈ నెల 19న నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 18 నుంచి 20లక్షల కుటుంబాలకు చెందిన సమాచారాన్ని సేకరించేందుకు సుమారు లక్షమంది ఎన్యుమరేటర్లను నియమించిన జిహెచ్ఎంసి సర్వేను పారదర్శకంగా చేపట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యంగా నగరంలోని సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే పాతబస్తీలో ఈ సర్వే ఎలా నిర్వహించాలన్న విషయంపై అధికారుల మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో నివసించే ఒక వర్గానికి చెందిన ప్రజలు సహకరిస్తారా? అన్న ప్రశ్న అధికారులను ఆందోళనకు గురి చేస్తోందట. కట్టుబాట్లు పాటించే ఒక వర్గానికి చెందిన ప్రజలకు సర్వేపై అవగాహనను పెంపొందించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవటంతో పాతబస్తీలో సర్వే ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది.
అంతకుమించి పాతబస్తీలో ఈ సర్వే విధులు నిర్వహించేందుకు అధికారులు ఒకింత వెనకంజ వేస్తున్నారట. అలాగే సర్వే చేపట్టనున్న ఈ నెల 19న మంగళవారం కావటంతో మరో వర్గానికి చెందిన మహిళలు కూడా ఎంతో భక్తిశ్రద్దలతో శ్రావణ మాసం మంగళగౌరీ వ్రతాల నిర్వహణలో తలమునకలై ఉంటారు.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పాతబస్తీలో నేటికీ ఓటరు ఐడి కార్డులు, రేషన్కార్డుల్లేని కుటుంబాలెన్నో కూడా ఉన్నాయి. అలాగే పాతబస్తీలో ఒక వర్గానికి చెందిన ప్రజల్లో బహు భార్యాత్వం, రెండు ఇళ్లు ఉన్న వారు కూడా తమ వివరాలను ఎలా సమర్పించాలన్న అయోమయంలో వుండి మజ్లిస్ ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారట.
అసద్ను అడుగుతారట
ఒకరోజు కొనసాగే సమగ్ర కుటుంబ సర్వేను పాతబస్తీలో పకడ్బందీగా, పారదర్శకతతో నిర్వహించేందుకు వీలుగా స్థానిక పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఇతర నేతల సహాయం తీసుకుంటామని జిహెచ్ఎంసి చెబుతోంది. అంతేగాక, 19న నిర్వహించనున్న సర్వేకు ముందు రెండుసార్లు ప్రయోగాత్మక సర్వే నిర్వహించి, ప్రజల్లో అవగాహనను పెంపొందించనున్నారు. ఇందుకు అసద్ సహకారం కోరనున్నారట.