సీమాంధ్ర నేతలు: చిరంజీవి విందు, గవర్నర్తో భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వచ్చిన సీమాంధ్ర నేతలకు చిరంజీవి తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ విందు భేటీలో తాము చేయాల్సిన ప్రయత్నాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రాన్ని మించిన ప్యాకేజీ మరేదీ లేదని సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. చిరంజీవి తన విందును కొంత మంది సీమాంధ్ర నాయకులకు పరిమితం చేసినట్లు తెలిసింది.
మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్, కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, శాసనసభ్యులు వంగా గీత, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులతో కూడిన బృందం శుక్రవారం ఏపీ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని, ప్రధాని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసినప్పుడు సమైక్యాంధ్ర ప్రజల మనోభావాలను కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్తో భేటీ తర్వాత వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ తెలంగాణ ఇవ్వాలని కోరడంతోనే తాము కూడా నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణపై వెనక్కి తగ్గినట్లుగా ప్రతిపక్షాలు స్పష్టంగా చెప్పడం లేదని, ఒకవేళ అవి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా తాము తీసుకోలేమని కాంగ్రెస్ అధిష్ఠానం చెబుతోందని టిజి వెంకటేశ్ వివరించారు.
పార్లమెంట్లోకి బిల్లు రాకుండా తాము ఎలాగైనా అడ్డుకుంటామని, అయితే సీమాంధ్ర ప్రజల ఇబ్బందులను కూడా అధిష్ఠానానికి వివరించాలని గవర్నర్ను కోరామన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం, బిల్లును దశలను పాటించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.