బాబు ఇబ్బంది పెడ్తున్నాడు: హరీష్, షబ్బీర్ హెచ్చరిక
హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంగళవారం అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ సర్కారును చంద్రబాబు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆర్డీఎస్ పనులను కర్నూలు రౌడీలే అడ్డుకుంటున్నారని చెప్పారు.
కేంద్ర బలగాల సాయంతో అయినా ఆర్డీఎస్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఐదువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నీటి పారుదలకు అధిక పార్ధాన్యత ఇస్తామన్నారు. ఖరీఫ్ నాటికి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. అంతకుముందు హరీష్ రావు ఆలంపూర్లోని జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారికి, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
అడిగితే లాఠీ దెబ్బలా?: షబ్బీర్ అలీ
రైతులు విద్యుత్ అడిగినందుకు తెలంగాణ ప్రభుత్వం వారి పైన లాఠీఛార్జ్ చేయిస్తుందా అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. నార్సింగి లాఠీఛార్జీ ఘటనలో గాయపడ్డ రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతుల పైన కేసులు పెడితే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని, విద్యుత్ ఉండదన్నారు. కామారెడ్డిని మెదక్ జిల్లాలో కలిపితే చూస్తూ ఊరుకోమన్నారు.
సమస్యలు పట్టించుకోరా?: పొన్నాల
ఈ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వేరుగా అన్నారు. ఇతర పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు, జెండా ఎక్కడ ఎగురవేయాలో ఆలోచించేందుకు గంటలకొద్ది సమీక్షలు జరుపుతున్న కేసీఆర్.. రైతుల విద్యుత్ సమస్య పైన సమీక్షలు జరపరా అని ప్రశ్నించారు.