అక్బరుద్దీన్కు తెలంగాణ షాక్, హరీష్ రావు హెచ్చరిక
హైదరాబాద్/మహబూబ్ నగర్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణవాదులు షాక్ ఇచ్చారు. గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం జెపి దర్గా వద్దకు వచ్చిన అక్బర్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. మజ్లిస్ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణకు మద్దతివ్వాలని డిమాండ్ చేశారు.
హరీష్ రావు హెచ్చరిక
హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన ఆంక్షలు లేని తెలంగాణ తప్ప, రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. రాయల టి అంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ గద్దెలు కూల్చుతామని హెచ్చరించారు.
తెలంగాణపై రాయలసీమ నాయకులు ఎన్నో కుట్రలు చేశారని, అలాంటి వారితో తాము కలిసే ప్రసక్తి లేదన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం మేరకు పది జిల్లాల తెలంగాణ ఇవ్వాల్సిందే అన్నారు. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేందుకు, తెలంగాణను ఫ్యాక్షన్ మయంగా మార్చేందుకు, హైదరాబాదులో భూదందాలు కొనసాగించేందుకు కొంతమంది స్వార్థ నాయకులు రాయల టి కుట్ర పన్నారన్నారు.
తెలంగాణవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారని, ఇప్పటికేనా మంత్రుల బృందం (జివోఎం) కళ్లు తెరవాలన్నారు. సంపూర్ణ తెలంగాణ బిల్లును సిఫార్సు చేయాలన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హరీష్ రావు సిద్దిపేట బస్టాండు వద్ద ధర్నా చేపట్టారు. అదిలాబాదులో జోగు రామన్న, కరీంనగర్లో గంగుల కమలాకర్ తదితరులు ధర్నా చేపట్టారు. పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకటి అంగీకరించేది లేదన్నారు.