ఆ ఎంపీకి తెలుగుదేశం, జనసేన నుంచి ఫుల్ డిమాండ్..!! నిర్ణయం ఎటువైపో??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు రెబల్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యామ్నాయం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు. ఇందులో ఆయన ఏ పార్టీని ఎంచుకుంటారనే విషయమై స్పష్టత రాలేదు. వరద బాధితులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట జనసేనాని పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. తమ పర్యటనల్లో వారిద్దరూ రఘురామకృష్ణంరాజుకు మద్దతుగా మాట్లాడారు. ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ పదే పదే ప్రస్తావించారు.

ఉభయ గోదావరిలో బలంగా కాపు, క్షత్రియ
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు, క్షత్రియ సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరిలో అత్యధికశాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గారు. అయితే రఘురామకృష్ణంరాజుకు, వైసీపీ ప్రభుత్వానికి నడుస్తున్న యుద్ధంవల్ల రఘురామకు ఆయన సామాజికవర్గంలో సానుభూతి దక్కుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలంగా ఉన్న కాపు సామాజికవర్గం తనైవైపు ఉంటుందనే నమ్మకంతో పవన్ ఉన్నారు. గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లను జనసేన దక్కించుకోగలిగింది. రఘురామ కూడా తనవైపు ఉంటే ఈ రెండు జిల్లాల్లోనే అత్యధిక సీట్లను సాధించి కింగ్ మేకర్ గా అవతరించగలననేది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది.

స్థానిక ఎంపీకి ఆహ్వానం లేనందువల్లే హాజరకాలేదు..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ రఘురామ పేరును పదే పదే ప్రస్తావించడంద్వారా ఈ రెండు జిల్లాల్లోని క్షత్రియుల ఓట్లను కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం దాగివుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ అయితే ఏకంగా తాను ప్రధానమంత్రి సభకు గైర్హాజరు కాకపోవడానికి స్థానిక ఎంపీ అయిన రఘురామను ఆహ్వానించకపోవడంవల్లేనని ప్రకటించేశారు. దీనికి ప్రతిస్పందనగా రఘురామ వీడియో విడుదలచేసి పవన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ ధైర్యం ఉన్న రాజకీయ నేత అని కొనియాడారు.
ఎంపీ రఘురామను చంపేసి దాన్ని వేరేవారిపై వేద్దామనుకున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

టీడీపీకి, జనసేనకు కీలకంగా..
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తి. ఆయన తమ పార్టీలో ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను బలంగా ఢీకొట్టడానికి అవకాశం ఉంటుందని ఇరువురు నేతలు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి స్పష్టతైతే రాలేదు. పొత్తు కుదిరేవరకు ఎవరికి వారు క్షత్రియులను పూర్తిగా తమవైపునకు తిప్పుకోవడానికి రఘురామకృష్ణంరాజును అస్త్రంగా ఉపయోగించుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంపీ రఘురామ మాత్రం టీడీపీకి, జనసేనకు కీలకంగా మారారు. చివరి నిముషంలో ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు మరి.












Click it and Unblock the Notifications