నేతల విజ్ఞప్తి... సందిగ్ధంలో చంద్రబాబునాయుడు!!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గతమెంతో ఘనం. కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులతో రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ ఎంతోమంది సీనియర్ నేతలు ఇతర పార్టీలకు వలసపోయారు. పార్టీమీద అభిమానంతో ఓట్లు వేయాలనుకున్నవారికి రాష్ట్రంలో బలమైన నాయకులు లేకపోవడం నిరాశ పరుస్తోంది. తెలంగాణ మీద కూడా దృష్టి సారించండి.. అని పార్టీ నేతలు చంద్రబాబును కోరుతున్నారు. విలీన మండలాల పర్యటనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదగా వెళ్లిన అధినేత భద్రాచలంలోనే బస చేశారు.
ఆ పర్యటనలో తెలంగాణ ప్రాంతం నుంచి ఆయనకు భారీ స్పందన లభించింది. త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం.. హాజరు కావాలని తెలంగాణ టీడీపీ నేతలు కోరారు. ఏపీపై పూర్తిగా దృష్టిసారించిన తరుణంతోపాటు భవిష్యత్తు రాజకీయ పరిణామాలున బేరీజు వేసుకొని పూర్తిగా ఔనని, కాదనికానీ చెప్పలేదని సమాచారం.

ఈసారి కేసీఆర్ కు అవకాశం ఇవ్వకూడదనే యోచనలో...
రాష్ట్రం విడిపోయిన తర్వాత గత రెండు ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించి సెంటిమెంట్ అస్త్రంతో కేసీఆర్ విజయం సాధించారనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. దీంతో ఈసారి అటువంటి అవకాశం కేసీఆర్కు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏపీ కంటే తెలంగాణలో పార్టీకి కార్యకర్తల బలం ఎక్కువ. అటువంటి పార్టీకి ఇప్పుడు బలమైన నాయకులు లేకపోయినా ఓటింగ్ మాత్రం ఇప్పటికీ గౌరవస్థాయిలోనే ఉంటుందనేది అన్ని రాజకీయ పార్టీల భావన.

ఏపీ ఎన్నికలే కీలకం
ఏపీలో పార్టీకి ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా భావిస్తున్న చంద్రబాబు తెలంగాణపై దృష్టిసారించే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే ముందుగా ఎన్నికలు వస్తాయి. రాష్ట్రంపై దృష్టిసారించే అవకాశం ఉన్నప్పటికీ మరోసారి కేసీఆర్కు అవకాశం ఇవ్వకూడదనే యోచనతో తమ నేత ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈసారికి కూడా చంద్రబాబు ఏపీపైనే పూర్తిగా దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

సెటిలర్లపై టీడీపీ ప్రభావం
తెలంగాణలోని సెటిలర్ల ఓట్లు అన్ని పార్టీలకు కీలకం కావడం.. వారిపై తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇప్పటినుంచే అన్ని పార్టీలు వారిని దరిచేర్చుకునే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండటంతో ఇరుపార్టీలు సెటిలర్ల ఓట్లపై దృష్టిసారించాయి.
వారి ఓట్లు బీజేపీకి కావాలంటే తమకు మిత్రపక్షంగా ఉన్న పవన్కల్యాణ్ కన్నా చంద్రబాబుపైనే ఆధారపడాల్సి ఉంటుందనే విషయం ఢిల్లీ పెద్దలకు తెలుసు. చంద్రబాబునాయుడి ప్రభావం లేకుండా తమంతట తాముగా వారిని ఆకట్టుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరు ఎవరిని ఆదరిస్తారో? ఎవరికి విజయం దక్కుతుందో? అందులో టీడీపీ ప్రభావమెంత? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications