పశ్చిమలో తమ్ముళ్ల పోరు.. చంద్రబాబుదే ఫైనల్
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతానికి భిన్నంగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఏడాదిన్నర, ఏడాది ముందుగానే ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా పనిచేయనివారికి టికెట్లివ్వనని స్పష్టంగా చెబుతున్నారు. ముందుగా ఖరారు చేసుకుంటూ వస్తోన్న అభ్యర్థులంతా గెలుపు గుర్రాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తానే స్వయంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనప్పటికీ మరికొన్నింటిలో నియమించాల్సి ఉంది. జనసేన పార్టీతో పొత్తు ఖరారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకివ్వాల్సిన నియోజకవర్గాలను వదిలిపెడుతున్నారు. జనసేనకిచ్చేవి కాకుండా ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు.

ఏలూరు, కొవ్వూరు, నిడదవోలు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఈ నియోజకవర్గాల్లో సీట్ల కోసం నాయకులు పోటీపడుతున్నారు. పోలవరంలో బొరగం శ్రీనివాసరావు, మోడియం శ్రీనివాసరావు మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఎవరికి సీటిచ్చినా కచ్చితంగా అసంతృప్తిని ఎదుర్కోక తప్పదు. దీన్ని ఎలా పరిష్కరిస్తారా? అని నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబువైపు చూస్తున్నారు.

మాజీ మంత్రి కేఎస్ జవహర్ కొవ్వూరు నుంచి మరోసారి పోటీచేయాలని భావిస్తున్నప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మరోవర్గం డిమాండ్ చేస్తోంది. చింతలపూడి సీటు కోసం పలువురు పోటీపడుతున్నారు. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ.. ఇద్దరూ సీటు ఆశిస్తున్నారు. చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారో తేలాల్సి ఉంది. ఏలూరు సీటు కోసం బడేటి చంటికిస్తారా? వేరేవారికి కేటాయిస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. నరసాపురం, భీమవరం తాడేపల్లి గూడెం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలున్నప్పటికీ పొత్తులో భాగంగా ఈ మూడు నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారంటున్నారు.












Click it and Unblock the Notifications