జగన్కు షాక్ తప్పదా?: టిడిపివైపు గోదావరి సెంటిమెంట్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తప్పదని తెలుగుదేశం పార్టీ అంటోంది. ఏ రకంగా చూసినా తమ గెలుపు ఖాయమైపోయిందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మున్సిపల్ ఫలితాలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని, మే 16న విడుదల కానున్న అసెంబ్లీ, లోకసభ ఫలితాలు కూడా తమకే పూర్తిగా అనుకూలంగా ఉంటాయని జోస్యం చెబుతున్నారు.
సాధారణంగా గోదావరి జిల్లాలో ఏ పార్టీ గాలి వీస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని గతంలో పలుమార్లు రుజువు అయిందని, ఈసారి గోదావరి జిల్లాలో తమ పార్టీ హవా కనిపించిందని టిడిపి అంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తమ పార్టీ ఘన విజయం సాధించగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేదని చెబుతున్నారు.
అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను చూసినా తమ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కంటే దాదాపు రెండింతల స్థానాలను సాధించింది చెబుతున్నారు. తూర్పుగోదావరిలోని 57 జెడ్పీటీసీలకు తాము 38 స్థానాలను గెలుచుకోగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం 13 స్థానాలలో మాత్రమే విజయం సాధించిందని, ఎంపీటీసీల విషయానికి వస్తే.. తాము 500కు పైగా గెలుచుకుంటే ఆ పార్టీ 300కు పైచిలుకు మాత్రమే సాధించిందంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జెడ్పీటీసీలకు తాము 43 స్థానాల్లో విజయం సాధిస్తే ఆ పార్టీ కేవలం రెండింటికే పరిమితమైందంటున్నారు. ఎంపీటీసీల విషయానికి వస్తే తాము దాదాపు ఆరువందల స్థానాలకు దగ్గరగా ఉంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 250 మార్క్ను కూడా అందుకోలేదంటున్నారు. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ హవా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ తొలి నుండి ఉందని, తమ హవాకు తోడు గోదావరి సెంటిమెంట్ కూడా తమ వైపునే ఉందని టిడిపి నేతలు జోష్లో ఉన్నారు.