దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు కోపమొచ్చింది!
RRR చిత్రబృందం ప్రస్తుతం అమెరికాలో ఉంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. RRR ఆస్కార్ ప్రమోషన్స్ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. విశ్వవేదికపై మన తెలుగు సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలని, సరైన సమాచారం ఏదీ లేకుండానే ఎలా వ్యాఖ్యలు చేస్తారని రాఘవేంద్రరావు ప్రశ్నించారు. తెలుగు సాహిత్యం, తెలుగు దర్శకుడు, తెలుగు సినిమా, తెలుగు నటీనటులకు ప్రపంచ వేదికపై మొదటిసారిగా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అవి చూసి గర్వపడాలికానీ రూ.80 కోట్లు ఖర్చని చెప్పడానికి మీ దగ్గరమేనా ఆధారాలున్నాయా అంటూ దర్శకేంద్రుడు ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి ఆధారాల కోసం మీ దగ్గరేమైనా అకౌంట్స్ ఉన్నాయా? అని అడిగారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి పేరు పొందిన దర్శకులు డబ్బులు తీసుకొని సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా అన్నారు.
'బంగారుతల్లి' చిత్రం ప్రమోషన్స్లో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఇందులో ఆయన RRR బడ్జెట్పై వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాన్ని రూ.600 కోట్లు పెట్టి తెరకెక్కించారని, ఇప్పుడు ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆ చిత్రబృందం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని వ్యాఖ్యానించారు. ఆస్కార్ ప్రమోషన్స్కి పెట్టిన ఖర్చుతో 8 సినిమాలు రూపొందించవచ్చని, చిన్న సినిమా నిర్మాతలు బాగుపడతారన్నారు. ఈ వ్యాఖ్యలు అంతటా వైరల్గా మారడంతో తెలుగు సినీ ప్రియులు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. జనసేన నేత, చిరంజీవి సోదరుడు నాగబాబు సైతం స్పందించారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పబట్టారు.

RRR చిత్రబృందం ప్రస్తుతం అమెరికాలో ఉంది. రెడ్ కార్పెట్ పై నడిచే రోజు కోసం భారతావని ఎదురు చూస్తోందని, తెలుగువాడిగా ఈ స్థాయికి వెళ్లినందుకు గర్వంగా ఉందని ఈ చిత్రంలోని ఒక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విదేశీ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. రెడ్ కార్పెట్ పై కొమురం భీమ్ కానీ, రామ్ చరణ్ కానీ, రాజమౌళి కానీ నడవబోవడంలేదని, వందకోట్ల పైబడిన భారతీయులే అక్కడ నడవబోతున్నరాని ఎన్టీఆర్ అన్నారు. నాటు నాటు పాటను తాను లైవ్ లో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications