జయలలితతో ఫైట్ కి సిద్ధమైన తెలుగు నేత..
తమిళనాట ఎన్నికల పర్వం హీటెక్కిపోతున్న విషయం తెలిసిందే. గెలుపు ఓటముల లెక్కలు, సర్వేల వివరాలతో ఎన్నికల గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు సీఎం జయలలితపై ఓ తెలుగు వ్యక్తి పోటికి సిద్దమవడం ఆసక్తికరంగా మారింది.
ఆర్కే నగర్ నుంచి బరిలో దిగిన జయలలితపై, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన పోటీపై వివరణ ఇచ్చారు. గత ఎన్నికలో అన్నాడీఎంకే తరుపున జయలలితకు మద్ధతుగా ప్రచారం నిర్వహించిన తను, ఇటీవల అన్నాడీఎంకే అనుసరిస్తున్న విధానాలు నచ్చకే పోటీకి సిద్దమైనట్టు తెలిపారు.
ఈ ఎన్నికల్లో జయలలిత గెలిస్తే తెలుగువాళ్లకు తీరని నష్టం జరుగుతుందని.. నిర్బంధ తమిళవిద్య ప్రవేశపెట్టాలని చూస్తోన్న అన్నాడీఎంకే విధానాలను వ్యతిరేకించడానికే తాను పోటీలోకి దిగినట్టు పేర్కొన్న జగదీశ్వరెడ్డి, తెలుగు భాష పరిరక్షణ కోసం తాను ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. నిర్బంధ తమిళవిద్యపై పునరాలోచించాలని ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా జయలలిత పట్టించుకోలేదన్నారు.
తమిళనాడులో ఉన్న మైనారిటీలను ద్రుష్గిలో ఉంచుకుని సమస్యలు పరిష్కారించడానికి జయలలిత సుముఖత వ్యక్తం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పారు. ఒక్క ఆర్కే నగర్ లోనే లక్షా ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని.. ద్రావిడ పార్టీలు వాళ్ల సమస్యలను గాలికి వదిలేసి తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు జగదీశ్వరెడ్డి.