లక్ష మంది తెలుగు ఓటర్లు: హీరో విశాల్ వైపా, మధుసూదన్ వైపా?
Recommended Video

హైదరాబాద్: తమిళనాడులోని ఆర్కే నగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ హీరో విశాల్రెడ్డికి మద్దతు ఇచ్చే విషయంపై తెలుగు సంఘాలు ఆలోచన చేస్తున్నాయి.
విశాల్ పోటీపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జయలలిత మరణించడంతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగుతుండడంతో విశాల్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

జయలలిత రెండు సార్లు, విశాల్ ఇలా...
ఆర్కె నగర్ స్థానం నుంచి ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు ఆ స్ధానంలో తెలుగు సంతతికి చెందిన సినీ హీరో విశాల్రెడ్డి పోటీ చేస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

అంతా కలిసి చర్చించుకుంటాం
విశాల్ రెడ్డికి ఎన్నికలో మద్దతు ఇచ్చే అంశంపై తెలుగు సంఘాలన్నీ కలిసి చర్చించుకుని నిర్ణయం ప్రకటిస్తామని జగదీశ్వర్రెడ్డి చెప్పారు. ఇదే ఉప ఎన్నికలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన అన్నా డిఎంకె అభ్యర్థి ఈ.మధుసూదన్ కూడా పోటీలో ఉన్నందున, ఆయనకు మద్దతు విషయంపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు.

ఆర్కె నగర్లో తెలుగు ఓటర్లు లక్ష మంది
ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు దాదాపు లక్ష మంది ఉంటారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఇక్కడ విజయాన్ని నిర్ణయించేది తెలుగు ఓటర్లేనని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగు ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, కనీస వసతుల కల్పనలో వివక్షను చవి చూస్తున్నారని ఆయన అన్నారు.

మోడల్గా తీర్చిదిద్దుతామని జయలలిత
జయలలిత ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆర్కె నగర్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారని జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఇవన్నీ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పోటీలో ఉన్న ఇద్దరు తెలుగు సంతతికి చెందిన అభ్యర్థులు ఆ నియోజకవర్గంలోని తెలుగు వారి కోసం ఏం చేయదలచుకున్నారో తెలియజేస్తూ ముందుకు వస్తే అప్పుడు తాము తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications