అతనొక్కడు వస్తే..: భూమా బాటలో మైసూరా? జగన్పై టిడిపి ప్లాన్
కడప: ఏపీలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా, ఆదివారం నాడు మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎరగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు సీఎం చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
రోజురోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరికలు పెరుగుతున్నాయి. కడప ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి వారం రోజుల క్రితమే టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్లు ప్రధానంగా వైసిపి అధినేత జగన్ను ఆయన సొంత ఇలాకా కడపలో బలంగా దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తున్నారట.
ఇందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ చేరారు. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు వైసిపి సీనియర్ నేత మైసూరా రెడ్డి కోసం పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా... మైసూరా టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
పైగా, ఆయన ఈ వార్తలను ఖండించడం లేదు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలతో ఆయన చర్చలు జరుపుతుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. చర్చలు సఫలమైతే ఆయన సైకిల్ ఎక్కడం ఖాయమని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఏదైనా పదవి ఆశిస్తుండవచ్చునని అంటున్నారు.
మీకు పార్టీ మారుతారనే వార్తల పైన స్పందించడం లేదని మైసూరా రెడ్డి దృష్టికి మీడియా తీసుకు వెళ్లగా.. మీరు తుమ్ముతూ.. మీరే తథాస్తు అంటున్నారని వ్యాఖ్యానించారట. నేను మీకు ఏం చెప్పలేదని అన్నారట. అయితే, ఖండించలేదని తెలుస్తోంది. చర్చలు సాగుతున్నాయని చాలామంది భావిస్తున్నారు.
మరోవైపు, జగన్కు ఇటీవల ఆయన దూరం కూడా పాటిస్తున్నారని అంటున్నారు. మైసూరా టిడిపిలోకి వస్తే జగన్ను మరింత దెబ్బతీసినట్లవుతుందని టిడిపి నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇందుకోసం పావులు కదుపుతున్నారంటున్నారు.