చంద్రబాబునాయుడి ఇంటివద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మొహరింపు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని కృష్ణా కరకట్టపై ఉన్న ఆయన ఇంటిచుట్టూ పోలీసులు భారీగా మొహరించారు. మూడు సంవత్సరాల క్రితం ఇదేరోజున జగన్ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూల్చివేసిన వేదికవద్ద నిరసన తెలియజేస్తున్నారు.
ఈరోజు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు చంద్రబాబు ఇంటివైపునకు వెళ్లే మూడు మార్గాలను ముళ్ల కంచెలు, బారికేడ్లతో మూసేశారు.

సచివాలయం నుంచి విజయవాడవైపు వెళ్లే మార్గం, ఉండవల్లి గుహల నుంచి చంద్రబాబు ఇంటివైపునకు వెళ్లే మార్గం, కొండవీటి వాగు నుంచి వెళ్లే మార్గాన్ని పూర్తిగా బారికేడ్లతో మూసేసి పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పొలాలవైపునకు వెళుతున్న రైతులను కూడా అడ్డుకుంటుండటంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితం ఇదేరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. అనంతరం అక్రమంగా నిర్వహించిన ప్రజావేదికను కూల్చివేయాలంటూ ఆదేశాలివ్వడంతో అర్థరాత్రి సమయంలో దాన్ని కూల్చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం టీడీపీ శ్రేణులు ప్రజావేదిక శిథిలాల వద్ద నిరసన తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications