ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత!: రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు అందుతున్న పరిహారం విషయంలో చర్చించుకునేందుకు రైతులు, రైతు కూలీలు గురువారం తలపెట్టిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్దండరాయునిపాలెంలో గురువారం సాయంత్రం స్థానిక రైతులు ప్రభుత్వం ఇస్తున్న భూ పరిహారం తదితర అంశాలపై చర్చింకునేందుకు రైతు కూలీలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ సమావేశం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రస్తుతం ఇక్కడ 144వ సెక్షన్ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. పోలీసులు చెప్పిన మాటలను లెక్కచేయకుండా రైతులు ఒక్కచోట చేరి చర్చించుకునేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు, రైతలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయింపు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తొలుత నేలపాడు రైతులకు ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ అధికారులు బుధవారం తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంలో శాఖమూరు రైతులు 1,571 మందికి ప్లాట్లను లాటరీ విధానం ద్వారా కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. రైతులను రాజధానిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తరతరాల నుంచి వస్తున్న భూమిని రైతులు త్యాగం చేయటం వల్లే రాజధాని నిర్మాణం చేయగలుతున్నామని అన్నారు.
ఆంధ్రుల రాజధాని అమరావతికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. అనంతరం సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ నేలపాడు గ్రామం అమరావతిలో అత్యుత్తమంగా ఉంటుందని చెప్పారు. ప్లాట్ల కేటాయింపు జరగగానే మూడు వారాల్లో హద్దులు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పారు.
కాగా, శాఖమూరు మొత్తం 1,571 మంది రైతులకు రెసిడెన్షియల్ 1,883 ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు 1,236 కేటాయించారు. వాణిజ్య, నివాసానికి సంబంధించిన వివరాలు రైతుల సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం వచ్చింది. అనంతరం వెంటనే రైతులకు ప్రొవిజన్ సర్టిఫికెట్లను అందజేశారు.