పెట్రోల్ బాటిల్తో హంగామా, కార్యకర్తలకు వంగవీటి రాధా హెచ్చరిక: రంగంలోకి నేతలు, జగన్ చెప్పేవరకు..
విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ నివాసం వద్ద కార్యకర్తలు పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు. ఓ కార్యకర్త పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నాలు చేశాడు. రాధాకృష్ణ కార్యకర్తలను వారించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సహించేది లేదని కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్నం వంగవీటి రాధా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఆయన ఇంటి వద్ద ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను అనుచరులు తొలగించారు. మీరు ఆశించిన టిక్కెట్ ఇవ్వకుంటే పదవులకు రాజీనామా చేస్తామని వారు చెప్పారు. వారిని వంగవీటి వారించారు. ఇంటి వద్ద అనుచరులతో భేటీ అయిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వంగవీటి రాధాతో నేతల సంప్రదింపులు
వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం రంగంలోకి దిగింది. పలువురు నేతలు ఆయనకు ఫోన్లు చేశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

వంగవీటి రాధా అనుమానాలు
పెద్దిరెడ్డి తీరుపై కూడా వంగవీటి రాధాకృష్ణ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓసారి మచిలీపట్నం లోకసభ అంటూ, మరోసారి అవనిగడ్డ అంటూ, ఇంకోసారి విజయవాడ ఈస్ట్ అంటూ ప్రతిపాదనలు తీసుకు రావడంపై ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారని తెలుస్తోంది. వంగవీటి ఇంటి వద్ద సోమవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

యలమంచిలి రవి సూచన
ఈ ప్రచారం నమ్మవద్దని, అధిష్టానం ప్రకటించే వరకు వంగవీటి రాధాకృష్ణ వర్గీయులు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని యలమంచిలి రవి సూచించారు. రాధా వర్గీయులు సంయమనం పాటించాలన్నారు. అభిమానులు నిరసనలు తెలిపితే వంగవీటి రాధాకు ఇబ్బంది అని వారు చెప్పారు. అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రానంత వరకు తొందరపాటు కార్యక్రమాలు చేపట్టవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. జగన్ స్పందించే వరకు వేచి చూడాలన్నారు.

వంగవీటి వర్గీయుల అల్టిమేటం
కాగా, వంగవీటి రాధాకృష్ణ ఆదివారం పార్టీ సమావేశం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తన కుటుంబానికి మంచి పట్టున్న విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటును కోరితే పార్టీ నేతలు ఇతర నియోజకవర్గాలను చూపించడంపై ఆవేదనగా ఉన్నారు. అంతేకాదు, ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఐదు గంటలలోపు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించకుంటే తమ దారి తాము చూసుకుంటామని రాధా వర్గీయులు అల్టిమేటం జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications