చంద్రబాబు రామతీర్ధం పర్యటనలో లారీలు అడ్డంగా, ఉద్రిక్తత ..జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నాసరే అడ్డుకోలేరన్న లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామతీర్ధం వెళ్లడానికి చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో టిడిపి నేతలు ఫైర్ అయ్యారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్ కి అనుమతి ఇచ్చి మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డు పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. టిడిపి నేతలు వాహనాలనన్నింటిని అనుమతించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును రామతీర్ధం పర్యటనలో అడ్డుకోవటంపై లోకేష్ మండిపడ్డారు.
చంద్రబాబు పర్యటనలో లారీలను అడ్డంగా పెట్టి వాహనాలు వెళ్ళకుండా అడ్డగింత
చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు రామతీర్థం పర్యటన జరగకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోడ్ల జంక్షన్ వద్ద చంద్రబాబుతో కలిసి వెళ్తున్న మిగతా నాయకులు అడ్డుకుని కేవలం చంద్రబాబు వాహనానికి అనుమతి ఇచ్చారని మండిపడుతున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి చినరాజప్ప, టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావు ఆటోలో రామ తీర్థానికి బయలుదేరి వెళ్ళారు .
మండిపడిన లోకేష్ .. జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా సరే చంద్రబాబు గారి రామతీర్థం పర్యటన ఆగదు
ఇక చంద్రబాబును రామతీర్థం పర్యటన చేయకుండా అడ్డుకోవడం కోసం సృష్టిస్తున్న అడ్డంకులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగ నడుస్తోందంటూ ఫైర్ అయ్యారు . లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా సరే చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని వైయస్ జగన్, విగ్రహాల ధ్వంసం అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు గారి పర్యటన లారీలు అడ్డంగా పెట్టి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ లోకేష్ మండిపడ్డారు.
రాజారెడ్డి రాజ్యాంగానికి రాష్ట్రంలో అడ్డూ, అదుపు లేకుండా పోతుంది
అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు ప్రతిపక్షనేత బయటకు వెళ్లకుండా గేట్ కి తాళ్లు కడతారు, ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు. రాజారెడ్డి రాజ్యాంగానికి రాష్ట్రంలో అడ్డూ, అదుపు లేకుండా పోతుంది అంటూ లోకేష్ భగ్గుమన్నారు. వాహనాలు రాకుండా లారీలు అడుగుపెట్టిన ఇంత అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదని, ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని టీడీపీ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తోంది. గుడికి వెళ్లే స్వేచ్ఛ, అన్యాయాన్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా పోలీసులను వ్యవస్థలను వాడుకొని ఏమీ సాధించలేరు అని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఇదంతా దేవుడు, ప్రజలు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.