టీడీపీ Vs జనసేన - వారి వల్లే, వర్మ ఫైర్..!!
ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురంలో రాజకీయం మారుతోంది. పవన్ గెలుపు కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేసాయి. పవన్ గెలిచిన తరువాత అక్కడ మార్పు మొదలైంది. రెండు పార్టీల మధ్య సమన్వయం కనిపించటం లేదు. ఆధిపత్య పోరు పలు సందర్భాల్లో స్పష్టం అయింది. టీడీపీ నేత వర్మ తాజా పరిణామాల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి జనసేనలో చేరిన నేతలే కారణమని మండిపడ్డారు. టీడీపీ నేతల తీరు పైన జనసైనికులు ఫైర్ అవుతున్నారు.
పెరుగుతున్న గ్యాప్
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కేడర్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. గత మూడు నెలల కాలంలో పలు సందర్భాల్లో రెండు పార్టీల కేడర్ తమ ఆధిపత్యం ప్రదర్శించుకొనేందకు ప్రయత్నం చేసాయి. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రచార సమయంలోనూ రెండు పార్టీల కేడర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాగ్వాదం, తోపులాట యత్నంతో ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేత పార్టీల కండువాల ప్రస్తావన తెచ్చారు. ఇది వివాదానికి దారితీసింది.

కండువాలపై వ్యాఖ్యలతో
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ కార్యక్రమం, కూటమి పార్టీల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన నిర్వహించి న ఈ సమావేశానికి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తో పాటు కూటమిలోని మూడు పార్టీల నేతలు హాజరయ్యారు. తొలుత వర్మ మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జనసేన నేత, మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు మైకు తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మెడలోని కూటమి పార్టీ కండువాలు పట్టుకుని చూపిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పసుపు కండువాలు మాత్రమే వేసుకుని వచ్చారని, జనసేన పార్టీ కండువాలు ధరించలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
వారి వలనే సమస్యలు
దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. టీడీపీ నేతలు రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమ కండువాల గురించి మీకు సంబంధం ఏంటంటూ నిలదీశారు. దీంతో సమావేశంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాలు తోపులాటకు ప్రయత్నించాయి. కాగా, కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనే యోచనతో జనసేనలోకి ఇటీవల వచ్చిన వైసీపీ కోవర్టుల వల్లే ఈ వివాదం తలెత్తిందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారితోనే ఇబ్బందులు వస్తున్నాయని వర్మ పేర్కొన్నారు. అదే సమయంలో జనసేన నేతలు కొందరు టీడీపీ నేతల అత్యుత్సాహం కారణంగా సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications