విజయవాడలో రణరంగం:ఇటు కాంగ్రెస్...అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళన
విజయవాడ:విజయవాడలో రాజకీయ పక్షాల ఆందోళనల కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగాప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలనే విషయమై టీడీపీ,వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్ పాల ఝాన్సీని కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ ప్రకటించడం ఆందోళనకు దారితీసింది.
మేయర్ ప్రకటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైసిపి సభ్యులుపాల ఝాన్సీ,చందన సురేష్, షేక్ అసిఫ్, మద్దా శివశంకర్ లను మార్షల్స్ తో బలవంతంగా బైటకు తరలించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది.

తమను మార్షల్స్ తో కౌన్సిల్ సమావేశం బైటకు గెంటేయడానికి నిరసనగా వైసిపి కార్పోరేట్లరు కౌన్సిల్ సమావేశం బైట ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో వైసిపి కార్పొరేటర్ పాల ఝాన్సీ సొమ్మసిల్లి పడిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
మరోవైపు సమావేశం లోపల తమ సభ్యులను మార్షల్స్ తో గెంటేయడాన్ని నిరసిస్తూ మిగతా వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద ఆందోళన కొనసాగించారు. అయితే వైసీపీ కార్పొరేటర్లను అకారణంగా సస్పెండ్ చేశారని టిడిపి మినహా మిగతా విపక్ష సభ్యులు తప్పుబట్టారు.
ఇదిలావుండగా విజయవాడలో మరోచోట పూలే జయంతి వేడుకల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూలే విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. సీఎం చంద్రబాబు వస్తున్నారంటూ కాంగ్రెస్ నేత కెవిపిని పూలే విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో బలవంతంగా పూలే విగ్రహం వద్దకు వెళ్లే ప్రయత్నం చేసిన కెవిపి, రఘువీరారెడ్డి, పల్లం రాజులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.












Click it and Unblock the Notifications