వివేకా హత్య కేసుకు ఆ నలుగురే కారణం - కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్....!!
మాజీ మంత్రి..సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 2019 ఎన్నికల ముందు పులివెందుల లోని తన నివాసంలో వివేకా హత్యకు గురయ్యారు. ఈ ఘటన అనేక మలుపులు తీసుకుంది. రాజకీయంగానూ ఆరోపణలు...విమర్శలకు కారణమైంది. వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించటంతో దీని పైన కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఘటన జరిగిన ప్రదేశాన్ని పరీశిలించింది. పలువురిని విచారించింది.

సీబీఐ సుదీర్ఘ విచారణ
వివేకా ఇంట్లో పని చేసే సిబ్బందితో పాటుగా ఆయన వ్యక్తిగత సిబ్బందిని సీబీఐ పలు మార్లు ప్రశ్నించింది. ఇందులో పులివెందుల కు చెందిన పలువురు రాజకీయ నేతలను విచారించింది. అనేక మంది పేర్లు తెర పైకి వచ్చాయి. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని సైతం సీబీఐ విచారించింది. అయితే, ఆకస్మికంగా వివేకా హత్య కేసులో నిందితుడు ఆచూకీ చెబితే రివార్డు ఇస్తామంటూ సీబీఐ ప్రకటించింది. ఆ తరువాత విచారణ కొనసాగింది. అయితే, వివేకా హత్య కేసులో మంగళవారం సీబీఐ ప్రాధమిక చార్జ్ షీట్ దాఖలు చేసింది.

పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు
కడప నుంచి పులివెందుల కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు ఐదారు సంచుల్లో కేసుకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చారు. పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో నిన్న ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇవాళ పూర్తిస్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై ఛార్జ్షీట్ దాఖలైంది.

నలుగురి పైన ప్రధాన అభియోగాలు
వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న టి.గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, షేక్ దస్తగిరిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. కానీ, సీబీఐ చేసిన ప్రకటనలో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా పేర్కొనటంతో ఇప్పుడు ఈ నలుగురి చుట్టూ కేసు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎవరు హత్య చేసారు అనే విషయం ఇంకా నిర్దరాణకు సీబీఐ వచ్చినట్లుగా లేదు. ఈ అంశాన్ని సీబీఐ తన ప్రకటనలో పొందుపర్చలేదు. ఇక, రాజకీయంగానూ ఈ కేసుల ఇప్పుడు ఏపీలో కీలకంగా మారింది.
Recommended Video

అసలు దోషులు ఎవరు..
టీడీపీ నేతలు అనేక సందర్బాల్లో వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ..ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక, సీబీఐ ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయటంతో త్వరలోనే ఈ కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అభియోగాలు మోపిన నలుగురిని గత ఆగస్టు..సెప్టెంబర్ మాసాల్లోనే అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ పేర్కొంది. అందులో ఇద్దరు బెయిల్ పైన బటయకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications