జగన్ ప్రభుత్వంలో మద్యం ఎలా కొన్నారో, ఎలా అమ్మారో తెలుసా ?, సీఐడీ దర్యాప్తులో షాక్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన మద్యం అమ్మకాల విషయంలో సీఐడీ అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. మద్యం అమ్మకాల్లో అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టలరీల కమిషనర్ గా పని చేసిన వాసుదేవ రెడ్డి పాత్రపై సీఐడీ అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
అప్పటి జగన్ ప్రభుత్వం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు, డిస్టలరీల కమిషనర్ గా వాసుదేవరెడ్డికి పూర్తి బాద్యతలు అప్పగించింది. ఆ సందర్బంలో మాట వినని వాళ్లను కంట్రోల్ లో పెట్టడానికి వాసుదేవ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారని, ఆయన పై అధికారులను సైతం బదిలీ చేస్తానని బెదిరించారని సీఐడీ అధికారుల ప్రాథమిక విచారణలో తెలిసిందని సమాచారం.

2014 నుంచి 2019 మద్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా చేసిన బ్రాండ్లు 32 ఉన్నాయని, వాటిని రెండింటికి తగ్గించడంలో వాసుదేవ రెడ్డి కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కొనుగోలు చేసిన బ్రాండ్ల మద్యం అంతకంటే ఎక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ లో కొనుగోలు చెయ్యడంలో వాసుదేవ రెడ్డి చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు డిస్టరీలను సబ్ లీజ్ కు తీసుకున్నారని, వాళ్లు తయారు చేసిన 65 శాతం మద్యం కొనుగోలు చేసేలా వాసుదేవ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారని ఆరోపణలు ఉన్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో అప్పటి ప్రభత్వం కొనుగోలు చేసిన టాప్ 5 మద్యం బ్రాండ్లను తరువాత జగన్ ప్రభుత్వం కొనుగోలు చెయ్యలేదని, నాసిరకం మద్యానికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేశారని, అదే మద్యం భారీ ధరలు పెట్టి ప్రజలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి.

ఇలా వచ్చిన మద్యం ఆదాయాన్ని సుమారు రూ. 14 వేల కోట్లకు పైగా వాసుదేవ రెడ్డి ఏపీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో కీలకపాత్ర పోఫించిన వాసుదేవ రెడ్డి బారీ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కొనుగోలు, విక్రయాలు మొత్తం వాసుదేవ రెడ్డి ఆదేశాల మేరకు జరిగాయని, ఆ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అంటున్నారు. మద్యం కొనుగోళ్లు, మద్యం విక్రయాల ఫైళ్లు సైతం అధికారులకు పంపకుండా వాసుదేవ రెడ్డి అడ్డుకున్నారని, ఆయన భారీ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications