ఏపీలో రేషన్ కార్డులదారులకు తీపి కబురు?
ఏపీలో రేషన్కార్డుదారులందరికీ ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ఈకేవైసీ గడువును పొడిగించింది. ఈ గడువు ఈ నెల 31 నాటికి ముగియాల్సి ఉంది. దాన్ని ఇంకో నెల రోజుల పాటు పొడిగించింది. ఈకేవైసీ చేయించుకునే గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచింది. ఆ తరువాత పొడిగింపు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
నిజానికి- ఈకేవైసీ చేయించుకోవడానికి తుది గడువు ఈ నెల 31. ఈలోగా రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈకేవైసీని నమోదు చేయించుకోవాలంటూ మొదట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు సర్కులర్ సైతం ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన యాప్, రేషన్ షాపులోని ఈ-పోస్ ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. రేషన్ కార్డులో పేరు ఉన్న అయిదు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా మిగిలిన వారందరూ కూడా ఈకేవైసీపీని పూర్తి పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు.
అనర్హులను వడపోయడానికే పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఈకేవైసీ ప్రక్రియను చేపట్టింది. ఒకే ఇంట్లో ఉంటూ రెండు నంబర్ల ద్వారా కార్డులను పొందడం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను అందులో నుంచి తొలగించకపోవడం, వాళ్ల పేర్ల మీద రేషన్ సహా ఇతర సంక్షేమ పథకాల లబ్దిని పొందుతోండటం వంటివి ప్రభుత్వం దృష్టికి రావడం వల్ల ఈకేవైసీ ప్రక్రియను చేపట్టింది.
అటు కేంద్ర ప్రభుత్వం సైతం దీనికి సంబంధించిన ఉత్తర్వులను గతంలో జారీ చేసింది. ప్రతి రాష్ట్రం కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించింది. దీని వల్ల అర్హులకు మాత్రమే బియ్యం సహా ఇతర నిత్యావసర సరుకులు అందజేయవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై కొంతకాలంగా అధికారులు కార్డుదారులకు అవగాహన కల్పిస్తోన్నారు.
గడువు దగ్గర పడినప్పటికీ- ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కావట్లేదనే ఫిర్యాదులు అధికారులకు అందుతోన్నాయి. కొన్ని చోట్ల ఈ-పోస్ మొరాయించడం, సర్వర్ సమస్యల వల్ల యాప్ తరచూ స్తంభించిపోతోండటం, అందులో వివరాలేవీ అప్డేట్ కాకపోవడం వంటి కారణాల వల్ల మరో నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈకేవైసీ గడువును అధికారులు పొడిగించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications