లోకేష్ 'బ్యాక్ రూమ్ బాయ్..' : ఎకనమిక్ టైమ్స్, కేటీఆర్ పై పొగడ్తలు
న్యూఢిల్లీ : సమవుజ్జీల కుమారులు కావడంతో.. భవిష్యత్తు రాజకీయం దృష్ట్యా సాధారణంగానే ఇద్దరి మధ్య పోలిక తీసుకురావడం సహజం. వ్యవహార శైలి దగ్గరి నుంచి పనితీరుతో సహా ప్రతీది గమనించే జనం దాని ఆధారంగానే సదరు వ్యక్తుల పట్ల ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. ఆ అభిప్రాయాలే భవిష్యత్తు రాజకీయాన్ని నిర్దేశిస్తాయి.
ఇంతకీ ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల సీఎంల కుమారులు కేటీఆర్-లోకేష్ పనితీరును పోలుస్తూ ప్రముఖ పత్రిక ఎకనమిక్ టైమ్స్ ఓ ఆసక్తకిర కథనాన్ని జనం ముందుంచింది. పత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. ఇటివలే ఓ జర్నలిస్ట్ సీఎం చంద్రబాబు దగ్గరికెళ్లి, '2019 ఎన్నికల్లో మీ అబ్బాయి లోకేష్ ను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారా..?' అని ప్రశ్నించారట. కాగా, సదరు జర్నలిస్టు ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు , 'ఎందుకు.. నాకేమైందని పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నారని' ఎదురు ప్రశ్నించారట.
ఇక పనితీరు పరంగా కేటీఆర్ ను ప్రశంసించిన పత్రిక.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను కేటీఆర్ సమర్థవంతంగా నిర్వర్తించిన తర్వాత సీఎం కేసీఆర్ కు ఆయన తనయుడిపై మరింత విశ్వాసం ఏర్పడిందని, ప్రస్తుతం కేటీఆర్ పట్ల కేసీఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నారని పేర్కొంది.
అంతేగాక కమ్యూనికేషన్ పరంగాను కేటీఆర్ కు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉందని, విదేశీ సంస్థల పెట్టుబడుల కోసం ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు సరైన ఫలితాలనిస్తున్నాయంటూ ఎకనమిక్స్ టైమ్స్ వెల్లడించింది. ఇక తన తండ్రి సీఎం అయినా కేటీఆర్ తన పరిధి దాటి వ్యవహరించడం లేదని, సమావేశాల్లోను ఆయన తన పరిధి మేరకే వ్యవహరిస్తున్నారని ఓ ప్రభుత్వ కార్యదర్శి చెప్పినట్టుగా అభిప్రాయ పడింది.
ఇక ఇందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ గురించి అభిప్రాయ పడింది పత్రిక. లోకేష్ జాతీయ కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా మట్టుకు లోకేష్ జోక్యం ఉంటున్నట్టుగా పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో లోకేష్ ప్రమేయం గురించి ప్రస్తావిస్తూ.. అడ్మినిస్ట్రేషన్ విషయాలు ఎప్పటికప్పుడు తన దృష్టికి రావడం కోసం సీతాపల్లి అభీషా లాంటి వ్యక్తులను ప్రత్యేకాధికారులుగా సీఎం వద్ద నియమించినట్టుగా పేర్కొన్న పత్రిక, లోకేష్ ను 'బ్యాక్ రూమ్ బాయ్' గా అభివర్ణించింది.
ఇకపోతే లోకేష్ పెళ్లి విషయంలోను చంద్రబాబు తెలివిగా వ్యవహరించారని చెప్పుకొచ్చింది పత్రిక. బ్రాహ్మణితో వివాహం ద్వారా లోకేష్ భవిష్యత్తు రాజకీయాలకు నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి పోటీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు బ్రాహ్మణితో లోకేష్ వివాహాం జరిపించినట్టుగా ప్రచురించింది.