Liquor Scam: ఈడీ రిపోర్టులో కవిత - వైసీపీ ఎంపీ పేరు : ఆప్ నేతలకు ముడుపులు..!!
YCP MP Magunta: రాజకీయంగా కలంకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త మలుపు తీసుకుంది. ఢిల్లీ మద్యం కేసులో 38 మంది ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారించింది. కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వారి పేర్లు ప్రస్తావించింది. అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు తెర మీదకు వచ్చాయి. వీరితో పాటుగా శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అశోక్ పాత్రను ప్రస్తావించారు. సౌత్గ్రూప్ కంపెనీ నుంచి ఆప్ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయని ఈడీ పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చగా మారుతోంది.
కవిత - ఎంపీ మాగుంట నియంత్రణలో..
ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి మనీశ్సిసోడియా కుడిభుజంగా చెప్పే ఈడీ అరెస్ట్ చేసిన అమిత్ అరోరా అరెస్టు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. అక్రమంగా ఆర్జించేలా ఆప్ నేతలు లిక్కర్ పాలసీని రూపొందించారని అందులో పేర్కొన్నారు. దీనిలో భాగంగా సౌత్గ్రూప్ కంపెనీ నుంచి ఆప్ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయని ఈడీ పేర్కొంది. ఈ కంపెనీని నియంత్రిస్తున్న వారిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్, మాగుంట, మరికొందరు ఉన్నారని వివరించింది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన వారి పాత్ర ఏంటనేది వివరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.
170 ఫోన్లను మార్చుతూ..ధ్వసం చేసి
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో కవితతోపాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట, మనీశ్సిసోడియా.. ఇలా మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని.. ఆ తర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని, అలా ధ్వంసం చేసిన డివైజ్ల విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో పెర్నాల్డ్ రికార్డ్ అనే అతిపెద్ద ఉత్పత్తిదారుకు దేశవ్యాప్తంగా 45 శాతం మార్కెట్ వాటా ఉందని, దాని డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని ఇండో స్పిరిట్స్కు అప్పగించేలా ఆప్కు చెందిన విజయ్ నాయర్ ఒత్తిడి చేశారని పేర్కొంది. దినేశ్ అరోరా, అమిత్ అరోరాతో కలిసి విజయ్ నాయర్ ఎల్1 లైసెన్సులను వదులుకునేలా(సరెండర్) కొంత మంది హోల్సెల్లర్లను, తమకు నచ్చిన హోల్సెల్లర్లను ఎంచుకునేలా ఉత్పత్తిదారులను ఒత్తిడి చేశారని వివరించింది. తమ ఇష్టం వచ్చిన వ్యక్తులకు భారీ లాభాలు అందేలా చూశారని ఈడీ స్పష్టం చేసింది. ఫలితంగా ప్రభుత్వం 12 శాతం మేర ఆదాయం.. అంటే రూ.581కోట్ల మేర నష్టపోయినట్లు వెల్లడించింది.
మాగుంట కుమారుడికి లైసెన్సులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పేరు ప్రచారంలోకి రావటం పై వైసీపీ ఎంపీ మాగుంట గతంలోనే వివరణ ఇచ్చారు. అసలు ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వెల్లడించారు. తన పైన చేస్తున్న ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఈడీ విచారణ సమయంలోనూ ఎంపీ మాగుంట కుమారుడికి నోటీసులు జజారీ చేసింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో మాగుంట కుమారుడు రాఘవకు చెందిన మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ రెండు జోన్లకు దక్కించుకుందని వివరించింది. శరత్ చంద్రారెడ్డికే అధిక రిటైల్ జోన్లు దక్కినట్లు వివరించింది. శరత్కు చెందిన అవంతికా కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కెమ్ఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఎకోసిస్టమ్స్ లిమిటెడ్ ఐదు జోన్లను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చర్చకు కారణమైంది.