విజయవాడలో నకిలి మందుల మాఫియా గుట్టురట్టు
కృష్ణా జిల్లా: విజయవాడలో మరో నకిలీ దందా వెలుగు చూసింది. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మందుల మాఫియా గుట్టురట్టయింది. ఈ డూప్లికేట్ మెడిసిన్స్ రాకెట్ కు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి నకిలీ మందుల తయారీకి వినియోగించే యంత్రసామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ కేంద్రంగా ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనేక ప్రముఖ కంపెనీల పేరుతో ఈ డూప్లికేట్ మందులను ఆంధ్రప్రదేశ్ కి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తమ కంపెనీ పేరుతో నకిలీ మందులు చెలామణి అవుతున్నట్లు జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారుల తనిఖీలు చేపట్టడంతో ఈ నకిలీ మందుల గుట్టు బైటపడింది. సాయి మెడికల్స్లో అల్ట్రా సెట్ నకిలీ మందులను అధికారులు గుర్తించారు. సన్ఫార్మా, పాంటాసిట్-డిఎస్ఆర్, పాంటాసిట్-40 పేరుతో ఈ నకిలీ మందులు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడయింది. నకిలీ మందుల తయారీ ముఠాను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసులను మంత్రి కామినేని శ్రీనివాసరావు అభినందించారు.