యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు...నూతన ఆవిష్కరణలకు రూ.130 కోట్లు:సిఎం చంద్రబాబు
తిరుపతి: రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సిఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతి తారకరామా స్టేడియంలో శనివారం ఎపి ప్రభుత్వం నిర్వహించిన 'జ్ఞానభేరి' కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో సామర్థ్యం, సృజనాత్మ కతను పెంపొందించడం...తద్వారా నూతన ఆవిష్కరణలను పెరిగేలా చేయడమే లక్ష్యంగా 'జ్ఞానభేరి' కార్యక్రమాన్ని శ్రీవేంకటేశుని పాదాల చెంతనుంచే ప్రారంభించినట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ వనరులకు కొదవలేదని వాటిని విద్యార్థులు వినియోగించుకుని, ఆధునిక సాంకేతికతను జోడించి అన్నిరంగాల్లోనూ ప్రయోగాలను విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం చంద్రబాబు వివరించారు. విద్యార్థులు చేస్తున్న ఆవిష్కరణలకు సాయంగా జిల్లాకు 10 కోట్లు చొప్పున 130 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఒక జాతీయపార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తే, మరో పార్టీ నవ్యాంధ్రని నట్టేట ముంచిందని సిఎం చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రధాని మన్మోహన్ ప్రకటించారన్నారు. ఈ హామీని అమలుచేస్తామని వెంకన్నసాక్షిగా ప్రస్తుత ప్రధాని ప్రకటించి యుటర్న్ తీసుకోవడమే కాకుండా ఆ విషయాన్ని పార్లమెంటులో ప్రకటించడం బాధ కలిగించిందని చెప్పారు.
యువతలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచేలా ‘జ్ఞానభేరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ యువత, విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. pic.twitter.com/Fj9FWpBeFf
— Andhra Pradesh CM (@AndhraPradeshCM) August 4, 2018
జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసని...మీరంతా ఓటర్లని...ఓటుతోనే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గర్జించాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో సిఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యవసాయాధారమైన జిల్లా అని...ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో పాడిపరిశ్రమ, డైరీ, హార్టికల్చర్ టెక్నాలజీని పెంపొందించే దిశగా ప్రయోగాలను వేగవంతం చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
పశువుల దాణాను, సైలేజ్ గడ్డిని 50 శాతం సబ్సిడీతో అందించి పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కలెక్టర్, ఎస్వీయూ వీసీ కలిసి నోడల్ యూనివర్శిటీగా ఉంటూ గ్రామాల్లో విద్యార్థులతో ప్రాజెక్టులు చేయించాలని ఆదేశించారు. అంతకుమునుపు వాలీబాల్ క్రీడాకారులతో కలిసి ఫైనల్ టోర్నమెంట్ను తిలకించి, కొద్ది సేపు వారితో కలిసి ఆటలో పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలోని దామినేడులో నూతనంగా నిర్మించిన గృహనిర్మాణాలను ప్రారంభించి, రెగ్యులరైజేషన్ ద్వారా పలువురు లబ్దిదారులకు ఇంటి పట్టాలను సిఎం చంద్రబాబు పంపిణీ చేశారు.