ఏపీ వాసులకు తాజా అలర్ట్ - మరో వారం వర్షాలు, ఎక్కడంటే..!!
వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. గత వారం వరకు రికార్డు ఉష్ణోగ్రతలు..వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇప్పడు అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికి వచ్చిన పంట నష్ట పోయింది. పంట నష్టం అంచనాలు సిద్దం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమయంలోనే ఏపీలో మరోసారి ఐఎండీ వర్షం హెచ్చరికలను జారీ చేసింది.
ఏపీలో మరి కొద్ది రోజులు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రస్తుతం విదర్భ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. గురువారం కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతోపాటు వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉత్తర కోస్తా, 29, 30 తేదీల్లో రాయలసీమలో భారీవర్షాలు కురుస్తాయి. 29, 30 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లోని అనేకచోట్ల వర్షాలు కురవనున్నాయి.

ఈనెల 28న ఉత్తరకోస్తాలో ఎండలు పెరుగుతాయని, ఆ తరువాత వర్షాలు కురవనున్నందున ఎండలు తగ్గుతాయని విశ్లేషించారు. కాగా, ఈనెల 30 నుంచి మే 3, 4 తేదీల వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ద్రోణి ఈనెల 29 నుంచి కోస్తాపైకి రానున్నందున వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాలతోపాటు గాలుల తీవ్రత ఉంటుందని, పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నమోదు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాధమిక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications