చిరంజీవిని తమ్ముళ్లు దాటేసారు - మోహన్ బాబు కుమారులు మాత్రం: జనసేన నేత సంచలనం..!!
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ.. గాడ్ఫాదర్. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. రామ్చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ను నిర్మించారు. సమకాలీన రాజకీయ అంశాలను ఇందులో చిత్రీకరించారు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్..
గాడ్ఫాదర్ పబ్లిసిటీలో భాగంగా చిరంజీవి విడుదల చేసిన ఓ వాయిస్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. 10 సెకెండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వాయిస్ నోట్.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. అంటూ రెండే రెండు డైలాగ్స్ ఎన్నో అంచనాలకు తెర తీసింది. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల నాటికి చిరంజీవి పొలిటికల్గా మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తారనే అభిప్రాయాలు మొదలయ్యాయి కూడా.
జనసేన ఫస్ట్ రియాక్షన్
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ వస్తోన్న వార్తలపై జనసేన పార్టీ స్పందించింది. దీన్ని స్వాగతించింది. అలాంటి ఏ నిర్ణయాన్నయినా తాము స్వాగతిస్తామని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యానారాయణ అన్నారు. సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ విడదీయరానివేనని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉందని పేర్కొన్నారు. రాజకీయాలను శాసించే స్థితిలో మెగాస్టార్ ఉన్నారని చెప్పారు.
నిజంగా గాడ్ఫాదర్..
సినిమా కథలో భాగంగా ఆ డైలాగ్ వచ్చినప్పటికీ- అది ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసే రాసి ఉండొచ్చని బొలిశెట్టి అన్నారు. రాజకీయాలకు చిరంజీవి ఎప్పుడూ దూరంగా లేరని తేల్చిచెప్పారు. మోగాస్టార్ తన స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారని, తనతో పాటు అందరినీ పరిశ్రమకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తన తమ్ముళ్లు, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఒక స్థాయికి తీసుకొచ్చారని అన్నారు. వారందరికీ చిరంజీవి నిజంగానే గాడ్ఫాదర్ అని అన్నారు.
మోహన్ బాబు కుమారులు..
మోహన్ బాబు కుమారులు మోహన్ బాబు అంతగా కాలేకపోయారంటూ మంచు విష్ణు, మనోజ్ గురించి వ్యాఖ్యానించారు. చిరంజీవి విషయంలో అలా జరగలేదని చెప్పారు. చిరంజీవి కుమారుడు చిరంజీవిని దాటేశారని, తమ్ముళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నారని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. మెగా కుటుంబం మొత్తం కూడా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంటే ఉందని, ఆయన అంటే ప్రాణం ఇస్తుందని స్పష్టం చేశారు.
జనసేనకే ప్రచారం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కుటుంబ సభ్యులందరూ తమ పార్టీకి ప్రచారం చేస్తారని బొలిశెట్టి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో వారందరిదీ ఒకేమాట మీద ఉన్నారని, చిరంజీవి అభిమానులు కూడా జనసేనకు మద్దతు ఇస్తారని తేల్చి చెప్పారు. ఇప్పటికే అయిదువేల మంది మెగాస్టార్ అభిమానులు జనసేనలో చేరారని అన్నారు. ప్రజారాజ్యంలో నేర్చుకున్న పాఠాలతో పవన్ కల్యాణ్ జనసేనను నిలబెట్టారని పేర్కొన్నారు.