టీటీడీ ఆర్జిత సేవలు రద్దు
TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా ముగిసింది. నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న వార్షిక వసంతోత్సవాలను దృష్టిలో పెట్టుకుని కోయిల్ అళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు అర్చకులు, టీటీడీ అధికారులు.
ఈ సందర్భంగా తెల్లవారు జామున సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు. 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం వసంతోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వసంతోత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7:45 నిమిషాలకు స్వర్ణ రథోత్సవంపై అమ్మవారు కటాక్షిస్తారు. ఈ మూడు రోజులూ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరిస్తారు.
ఈ ఉత్సవాల కారణంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు టీటీడీ అధికారులు. అంకురార్పణ జరిగే మే 21 నుంచి 24వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 23వ తేదీన తిరుప్పావడ సేవ, మే 24 తేదీన లక్ష్మీ పూజ ఆర్జితసేవలను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications