రుతుపవనాలు వచ్చేశాయ్, కానీ - రికార్డు స్థాయిలో..!!
ఎట్టకేలకు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతీ ఏటా రాయలసీమ మీదుగా ప్రవేశించే రుతువపనాలు ఈ సారి నెల్లూరు జిల్లా నుంచి అడుగుపెట్టాయి. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. ఈ రోజు రేపు మరింతగా విస్తరించనున్నాయి. రేపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. కానీ, మరో వారం పాటు ఎండల తీవ్రత తప్పదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
విస్తరిస్తున్న రుతుపవనాలు:
ఆరు రోజులు ఆలస్యంగా ఈ సారి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాలతో పాటుగా అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్నులు, అనంతపురి, గుంటూరు జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసింది.

రానున్న రెండు రోజుల్లో కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ ప్రాంతంలోనూ ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటు రుతుపవనాలు విస్తరించినా మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత తగ్గే అవకాశం లేదని భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది.
రికార్డు ఉష్ణో గ్రతలు నమోదు:
ఈ రోజు (సోమవారం) అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మొత్తం 134 మండలాల్లో తీవ్రంగా, 220 మండలాల్లో కొంతమేర వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
రాయలసీమలో కొన్నిచోట్ల రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 13,14,15 తేదీల్లోనూ వేడి గాలుల ప్రభఆవం కనిపించనుంది. దీంతో రుతుపవనాలు నెమ్మదించే అకాశం ఉందని పేర్కొంది. దీని వలన ఉక్కపోత ఎక్కువ కావటంతో పాటుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది.
రేపు తెలంగాణలోకి ప్రవేశం:
తెలంగాణ జిల్లాల్లో వచ్చే రెండ్రోజుల్లో (మంగళ లేదా బుధవారాల్లో) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీలో రుతుపవనాలు విస్తరించటంతో రేపు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ప్రవేశం తర్వాతే రాష్ట్రమంతా విస్తరించేందుకు ఎన్ని రోజులు పడుతుందో స్పష్టత రానుంది.
రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఆదివారం ఎండల తీవ్రత కొనసాగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడటంతో కొంత వాతావరణం చల్లబడింది.












Click it and Unblock the Notifications