మరోసారి ఏపీ ప్రభుత్వం అభ్యర్ధన - రాజధానిపై సుప్రీం కీలక నిర్ణయం..!!
ఏపీ రాజధాని కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో మరోసారి మూడు రాజధానుల వ్యవహారం ప్రధాన అంశంగా మారుతోంది. ఇప్పటికే రాజధానుల కేసు సుప్రీంలో పెండింగ్ లో ఉంది. కేసును త్వరగా విచారించాలని కోరుతూ వచ్చిన ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం ముందు తమ అభ్యర్ధన ఉంచింది. దీని పైన సుప్రీం నిర్ణయం ప్రకటించింది. అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వటంతో దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లింది. విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్దేశించిన కాల పరిమితిపైన స్టే ఇచ్చింది. సుప్రీం తుది తీర్పుకు అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవసరం మేర బిల్లు తేవాలని యోచిస్తోంది. కానీ, ఇప్పుడు సుప్రీం నిర్ణయం తో అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం సాధ్యమా కాదా అనేది తేలాల్సి ఉంది.

సుప్రీంలో మరోసారి ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉంది. అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు రాజధాని మార్పు అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని తీర్పు ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి నిర్దిష్ట సమయం కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీకి రాజధాని నిర్ణయాధికారం ఉందని.. హైకోర్టు తీర్పు రద్దు చేయాలని కోరింది. దీని పైన విచారించిన సుప్రీం ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్న అంశాల పైన స్టే ఇచ్చింది. తదుపరి విచారణ జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును రాజధానుల కేసు త్వరగా విచారణకు తీసుకోవాలని అభ్యర్ధించింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలకు సిద్దం అవుతన్న వేళ రాజకీయాంగానూ ఈ నిర్ణయం కీలకం కానుంది.

వచ్చే నెల 28కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం రాజధాని కేసుల సత్వర విచారణ కోసం మెన్షన్ చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఏపీ రాజధానుల కేసు విచారణను మార్చి 28కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా ఉంటుందని ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నారు. సుప్రీం తీర్పు అనుకూలంగా వస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పాలన ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన. తీర్పు ఆలస్యం అయితే ముందుగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించి అక్కడ నుంచి పాలన చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తది తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో ఏడాది కాలంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాలనా పరంగా మూడు రాజధానుల నిర్ణయం కీలకంగా మారటంతో.. విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సుప్రీంను విచారణ వేగవంతం చేయాలని కోరుతోంది.

ప్రభుత్వం తదుపరి అడుగులు ఏంటి..
ఇప్పుడు సుప్రీంకోర్టు రాజధానుల కేసు వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే నెల 14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుప్రీం మూడు రాజధానులకు అనుమతి ఇస్తే ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా కార్యాచరణ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు మార్చి 28వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఆ సమయానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కానున్నాయి. మార్చి 28న విచారణ కు నిర్ణయించిన సుప్రీం కోర్టు ఆ రోజున ఎటువంటి సూచనలు చేస్తుందనేది కీలకం. అయితే, సుప్రీంలో తీర్పు వచ్చే వరకూ ప్రభుత్వం వేచి చూసే ధోరణితో ఉంటుందా.. లేక, ప్రచారం సాగుతన్నట్లుగా ముఖ్యమంత్రి విశాఖ నుంచి తన కార్యకలాపాల ప్రారంభానికి తుది నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications