ఏపీలో పవర్ కట్స్- ఉక్కపోతకు రెడీ
Temperature in Andhra Pradesh: ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటోన్న విద్యుత్ కోతలు దీనికి తోడవుతోన్నాయి. ఫలితంగా ఉక్కపోతకు గురి అవుతున్నారు జనం.
ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. నడివేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదవుతోందంటే.. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వచ్చే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్- మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఈ నెల 14వ తేదీన కోస్తా, రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా 10కి పైగా వేర్వేరు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం.. వచ్చే వేసవి తీవ్రత ఎలా ఉండబోతోందనే విషయాన్ని రుచి చూపించినట్టయింది. కోస్తా జిల్లాల్లో గాలిలో తేమశాతం 45 నుంచి 70 శాతం వరకు ఉండగా.. ఈ సంఖ్య రాయలసీమలో 25 నుంచి 45 శాతంగా రికార్డయింది.
పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువ కావొచ్చని అంచనావేసింది.
దీనికి అనుగుణంగా రాయలసీమ జిల్లాల్లో వేడి తీవ్రత రోజురోజుకూ అధికమౌతూ వస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు పైమాటే. ఆదోని, మంత్రాలయం, పత్తికొండ.. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications