అక్కడ అడుగుపెడితే విజయం ఖాయం?
విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడంవల్ల ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోను ప్రభావం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు.
వచ్చే ఎన్నికలు మూడు రాజధానులు, అమరావతే ప్రధాన అజెండాగా జరగబోతున్నాయనే విషయం ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో స్పష్టమైంది. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటాయని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ విశాఖ పరిపాలనా రాజధాని అని, తాను త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు.

5 జిల్లాల్లో ప్రభావం ఉంటుంది
విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడంవల్ల ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోను ప్రభావం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను ఆ నాలుగింటిని దక్కించుకోవాలని జగన్ యోచిస్తున్నారు. అందుకనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఈ మూడు జిల్లాలతోపాటు రాయలసీమ, నెల్లూరులో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే సులువుగా రెండోసారి అధికారం చేపట్టవచ్చని వైసీపీ భావిస్తోంది.

ప్రతిపక్షాలను దిగ్బంధించాలి
తెలుగుదేశం కానీ, జనసేన కానీ రాయలసీమలో ప్రచారానికి వెళ్లినప్పుడు లేదంటే ఉత్తరాంధ్రలో ప్రచారానికి వచ్చినప్పుడు అమరావతిని గట్టిగా చెప్పలేరని, ఆ విషయంలో ప్రజల భావోద్వేగాలు ముఖ్యంగా మారతాయని వైసీపీ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి విశాఖపట్నం వచ్చేశారంటే ఇక్కడి ప్రజలకు కూడా విశాఖ రాజధాని అనే విషయంపై నమ్మకం కలుగుతుందని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు ప్రజలకు నమ్మకం కలుగుతుందంటున్నారు. ప్రతిపక్షాలను ఈ విషయంలో దిగ్బంధనం చేసినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.

7వ తేదీన సుప్రీం కోర్టు తీర్పును బట్టి..
అమరావతి రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వాస్తవానికి 31వ తేదీనే విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కేసు బెంచ్ ముందుకు రాలేదు. ఫిబ్రవరి ఏడోతేదీన విచారణ కోసం బెంచ్ ముందుకు రాబోతోంది. దాదాపు అమరావతి రాజధాని విషయంపై ఆరోజు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సుప్రీం కోర్టు రాజధాని నిర్ణయించే అధికారం ఏపీ సర్కార్ కే అప్పగిస్తే వెంటనే విశాఖకు వైసీపీ వెళ్తుంది. ఒక వేళ అలా కాకుండా హైకోర్టు నిర్ణయానికే వదిలేస్తే ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అప్పుడు విశాఖ వెళ్లాలంటే సాంకేతిక కారణాలను వెతుక్కోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications