జగన్కు టైమొచ్చింది.. ఇక విజృంభించడమే తరువాయి..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇది సరైన సమయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావల్సిన ప్రత్యేక హోదాకానీ, లేదంటే ప్రత్యేక ప్యాకేజీకానీ, పోలవరం నిధులుకానీ... ఇలా రాష్ట్రానికి ఏవి అవసరమైనా సాధించుకోవడానికి ఇంతకు మించిన సమయం రాదని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ అవకాశం దాటిపోతే మళ్లీ కష్టమంటున్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని జగన్ వినియోగించుకోవాలని, రాష్ట్రానికి శుభవార్త అందివ్వాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.

రాష్ట్రప్రతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు?
ఇంతకీ జగన్కు వచ్చిన ఆ మంచి సమయం ఏమిటంటే రాష్ట్రపతి ఎన్నికలు. నోటిఫికేషన్ వెలువడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేదు. 1.2 శాతం ఓట్ల తేడా ఉంది. మరోవైపు మమతాబెనర్జీ, కేసీఆర్ కాంగ్రెస్తోపాటు బీజేపీయేతర పక్షాలన్నింటినీ కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. ఎన్డీయే తరఫున బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించాలంటే వైసీపీ, బిజూ జనతాదళ్, అన్నాడీఎంకే మద్దతు అవసరమవుతుంది. ఇవి మద్దతిస్తాయనే నమ్మకంతో బీజేపీ పెద్దలున్నారు.

మద్దతుగా మూడు పార్టీలున్నాయి!!
ఈ మూడు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతిస్తాయని బీజేపీ నేతలు ముందే చెప్పేస్తున్నారు. వాస్తవానికి ఈ మూడు పార్టీలు ఎన్డీయేలో లేవు. ఎన్డీయేతర, కాంగ్రెసేతర పక్షాలకు దూరంగా ఉంటాయి. కానీ సభలో అవసరమైనప్పుడల్లా బీజేపీకి మద్దతిస్తుంటాయి.
రాష్ట్రానికి కావల్సిన అదనపు ప్రయోజనాలను సాధించుకోవడానికి, అభివృద్ధి పథంలో పయనింపచేయడానికి కేంద్రం సహకారం అవసరం. అంతేకుండా నిధుల లేమి వెంటాడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలంటే నిధుల కొరత రాకుండా చూడాలని వైసీపీ కోరబోతోందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడివడిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా డిమాండ్ చేయాలని విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.

రంగంలోకి రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా!
రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. ఇతర పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలను ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించుకోవాలంటే వైసీపీకి ఇదే మంచి తరుణమని, రాష్ట్ర డిమాండ్లకు కేంద్ర నాయకత్వం తలొగ్గే అవకాశాలున్నాయని సీనియర్ రాజకీయవేత్తలు చెబుతున్నారు. మరి వైసీపీ ఎంతమేరకు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం నుంచి రాబడుతుందో వేచిచూద్దాం.!!












Click it and Unblock the Notifications