తెలంగాణలో అలా: పేర్ని నానితో థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ: దిల్ రాజు సహా..!
అమరావతి: సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. దీనిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలతో పాటు రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా టికెట్ల రేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించొద్దంటూ సినీ పెద్దలు ప్రభుత్వంపై ఒత్తిళ్లను తీసుకొస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లను పెంచడాన్ని స్వాగతిస్తోన్నారు. హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేస్తోన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన థియేటర్లపై వేటు..
ఏపీలో సరైన నిర్వహణ, అనుమతులు లేని థియేటర్లపైనా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అసలే టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల థియేటర్ల నిర్వహించలేమంటూ యజమానులు చేతులెత్తేస్తోన్నారు. అధికారుల దాడులను నిరసిస్తూ థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తోన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన థియేటర్లపై అధికారులు సైతం ఉక్కుపాదం మోపుతున్నారు. వాటిని సీజ్ చేస్తోన్నారు. వేల రూపాయల జరిమానాలను విధిస్తున్నారు.

కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేకపోతున్నాం..
లైసెన్సు వ్యవహారాలు, నిర్వహణను పర్యవేక్షించడానికి ఏకంగా స్పెషల్ డ్రైవ్ సైతం చేపట్టడం థియేటర్ల యజమానులకు మింగుడు పడట్లేదు. ఈ స్థితిలో తాము థియేటర్లను నడపలేమంటూ పలువురు ఓనర్లు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు. టికెట్లను విక్రయించడం ద్వారా వచ్చే మొత్తంతో కరెంటు బిల్లులను సైతం కట్టుకోలేకపోతున్నామనే ఆందోళన వారిలో నెలకొని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 175 థియేటర్లు మూతపడినట్లు తెలుస్తోంది.

పేర్ని నాని అపాయింట్మెంట్..
ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు థియేటర్ యజమానులు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినానితో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. డిస్ట్రిబ్యూటర్లను కలుసుకోవడానికి మాత్రమే పేర్ని నాని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్లతో..
ఈ మధ్యాహ్నం 12 గంటలకు వారు మంత్రితో సమావేశం కానున్నారు. 20 మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రిని కలవడానికి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ భేటీ సందర్భంగా తాము ఎదుర్కొంటోన్న సమస్యలను డిస్ట్రిబ్యూటర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. సినిమా టికెట్ రేట్లపై పలువురు సినీ హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో తాము ఇబ్బంది పడుతున్నట్లు థియేటర్ యజమానులు, పంపిణీదారులు చెబుతున్నారు.

ప్రయోజనాలకే ప్రాధాన్యత..
శ్యామ్ సింఘరాయ్ విడుదల సమయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టినట్టయిందనే అభిప్రాయాలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యక్తమౌతోన్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలనేది వారి ప్రధాన విజ్ఞప్తి. దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటనేది ఈ మధ్యాహ్నానికి తెలిసిపోతుంది. డిస్ట్రిబ్యూటర్ల తరఫున దిల్ రాజు, ఇతర ఇండస్ట్రీ పెద్దలు మంత్రిని కలుస్తారని చెబుతున్నారు.

కమిటీ ప్రతినిధులు కూడా..
సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఏడుమంది అధికారులు, ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ను కమిటీలో చోటు కల్పించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒకరిని కమిటీలోకి తీసుకున్నారు. మంత్రి పేర్నినానితో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్ల సమావేశంలో ఈ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొంటారు.












Click it and Unblock the Notifications